హైదరాబాద్ లో అందరూ నిమజ్జన ఏర్పాట్లలోనే..

హైదరాబాద్ లో  అందరూ నిమజ్జన ఏర్పాట్లలోనే..
  • ‘సాగర్’​లో వ్యర్థాలు పేరుకుపోకుండా
  • 10 ఫ్లోట్​ ట్రాష్​ కలెక్టర్స్, ఎస్కవేటర్లు
  • భక్తుల కోసం 123 వాటర్​ క్యాంపులు
  • పంపిణీకి 35 లక్షలవాటర్​ప్యాకెట్లు సిద్ధం 
  • 10 వేల వాహనాలు రెడీ చేస్తున్న ఆర్టీఏ  

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఈసారి గణేశ్ ​శోభాయాత్ర జరిగే పాతబస్తీ మొదలుకుని మదీనా సెంటర్, అఫ్జల్​గంజ్, బేగంబజార్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్, లిబర్టీ, ట్యాంక్​బండ్, ఎన్టీఆర్​మార్గ్, నెక్లెస్​రోడ్​తో పాటు ఖైరతాబాద్​బడా గణేశ్​ఊరేగింపు జరిగే ఖైరతాబాద్, లక్డీకాపూల్, టెలీఫోన్​భవన్, సెక్రటేరియెట్, ఎన్టీఆర్​మార్గ్​ప్రాంతాల్లో పోలీస్, బల్దియా, హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

ట్రాఫిక్​ఆంక్షలతో పాటు వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి వాటర్​క్యాంపులు, నిమజ్జనం చేసిన తర్వాత విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని స్పీడప్​చేయనున్నారు. 

వెంటవెంటనే వ్యర్థాల తొలగింపు

నిమజ్జనం జరిగే రోజుల్లో హుస్సేన్​సాగర్​లో వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విగ్రహాలు, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను వేసిన వెంటనే తొలగించి కాలుష్యం పెరగకుండా చూడనున్నారు. ఇప్పటికే నిమజ్జనాలు జరుగుతుండడంతో హుస్సేన్​సాగర్​తీర ప్రాంతంలో 10 ఫ్లోట్​ట్రాష్​ కలెక్టర్స్​ (ఎఫ్​టీసీ)లను, మరో 10 ఎస్కవేటర్లను ఏర్పాటు చేశారు.  

భక్తులకు తాగునీటి సౌకర్యం

నిమజ్జనం జరిగే శనివారం హుస్సేన్​సాగర్​తీరంలోనే కాకుండా నగరమంతా వేలాది మంది భక్తులు రోడ్లపైకి వస్తారు. దీంతో వారికి తాగునీటిని అందించేందుకు వాటర్​బోర్డు 123 చోట్ల వాటర్​క్యాంపులను ఏర్పాటు చేయనున్నది. అలాగే, 35లక్షల వాటర్​ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. హుస్సేన్​సాగర్​ తీరంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రసాదాలు, అన్నదానం చేస్తాయి కాబట్టి వారికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా వాటర్​ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు వాటర్​బోర్డు తెలిపింది.  

వాహనాలను అందుబాటులో ఉంచుతున్న ఆర్టీఏ

నిమజ్జనాల కోసం మండపాల నిర్వాహకులకు ఆర్టీఏ వాహనాలను సమకూరుస్తోంది. వాహనం కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత మొత్తం అద్దె చెల్లిస్తే లారీలు, ట్రక్కులు, డీసీఎంలు, ఆటోలను సమకూరుస్తున్నారు. గతేడాది 8,500 వాహనాలను సమకూర్చిన ఆర్టీఏ ఈసారి దాదాపు 10వేల వాహనాలు అవసరమవుతాయని భావిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది.  

బల్దియా సిద్ధంగా ఉంది: కర్ణన్  

నిమజ్జనం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని బల్దియా కమిషనర్ కర్ణన్ తెలిపారు. సోమవారం పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా, సన్ రైజింగ్ పాయింట్, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్ లలో నిమజ్జన ఏర్పాట్లను అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. నగరంలో 20 ప్రధాన లేక్ లతోపాటు  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామన్నారు.  134  క్రేన్ లు, 259 మొబైల్ క్రేన్లు రెడీగా ఉన్నాయన్నారు. హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో ‘సాగర్’ లో తొమ్మిది బోట్లను, డీఆర్ఎఫ్  టీమ్స్​ను ,  200 గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. 

పోలీసుల  సహకారంతో 13 కంట్రోల్ రూమ్స్​ఏర్పాటు  చేశామన్నారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీమ్ లను సిద్ధంగా ఉంచామన్నారు. స్వచ్ఛతకు 14,486 మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టులలో పని చేస్తారన్నారు. చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకు125 జీసీబీలు, 102 మినీ టిప్పర్లు ఉపయోగించి 3వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి డంప్ యార్డుకు తరలించామని చెప్పారు. నిమజ్జన ప్రదేశాల్లో 39 మొబైల్ టాయిలెట్స్ , 56,187 టెంపరరీ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు.