హైదరాబాద్లో డేటింగ్ యాప్ ద్వారా సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్జెండర్ల పేరుతో ఓ ముఠా దోపిడీలకు పాల్పడుతోంది. డేటింగ్యాప్లో తమకు టచ్లో ఉన్న వారిని నేరుగా కలుసుకొని.. నిలువుదోపిడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
డేటింగ్ యాప్ ద్వారా నిరంతరం టచ్లో ఉన్న ట్రాన్స్జెండర్ల ముఠా ఇద్దరు వ్యక్తులను దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ముఠా సభ్యులను కలవడానికి బాధితులను ఎరగా వాడుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఇద్దరు బాధితులు ప్రముఖ డేటింగ్ అప్లికేషన్ ద్వారా ఈ గ్యాంగ్ సభ్యులతో సన్నిహితంగా ఉన్నారు.
కాగా, బాధితులిద్దరినీ బంజారాహిల్స్లోని భోలానగర్ ప్రాంతానికి రావాలని ట్రాన్స్జెండర్ల ముఠా కోరినట్లు పోలీసులు వివరించారు. అక్కడి వెళ్లిన వారిని దుస్తులను తీసివేయాలని చెప్పి, ఆకర్షించి వారి వీడియోలను తీసినట్టు సమాచారం. అయితే ఆ వీడియోలను బహిరంగ పరుస్తామని బెదిరించి.. వారి దగ్గర ఉన్న వస్తువులను బలవంతంగా ఎత్తుకెళ్లారని బంజారాహిల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. నరేందర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇదే తరహాలో ముఠా చాలా మందిని దోపిడీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.