ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం

 ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం

బషీర్బాగ్ లోని దోమలగూడలో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఇళ్లంతా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. వెంటనే క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.   ప్రమాదం జరగడంతో  ఇంట్లో సమాన్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.  

పిండి వంటలు వండుతుండగా.. 

బషీర్ బాగ్ లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించిన కారణాలను స్థానికులు వివరించారు. బోనాలు సందర్భంగా ఇంటికి బంధువులు, చుట్టాలు వచ్చారని పిండి వంటలు వండుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు. మొదట మంటలు వచ్చాయని.. గుర్తించిన వెంటనే సిలిండర్ ను బయటకు తీసుకువచ్చామని.. అప్పటికే ప్రమాదంలో ఏడుగురు గాయపడినట్లు చెబుతున్నారు.