
న్యూఢిల్లీ: భారతదేశంలో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ (62 ) 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ( ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో) మొత్తం రూ.10.41 కోట్ల రెమ్యూనరేషన్ (జీతం, ఇతర బెనిఫిట్స్) తీసుకున్నారు. ఇతర టాప్ కంపెనీల చైర్మన్లు, కీలకమైన ఎగ్జిక్యూటివ్ల కంటే అదానీ రెమ్యునిరేషన్ చాలా తక్కువ. అదానీ గ్రూప్ నుంచి 9 లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ, కేవలం రెండు కంపెనీల నుంచి మాత్రమే ఆయన శాలరీ అందుకున్నారు. 2023-–24లో తీసుకున్న రూ. 9.26 కోట్లతో పోలిస్తే మాత్రం ఈ ఏడాది 12 శాతం ఎక్కువ జీతం అందుకున్నారు.
ఈ కంపెనీల నుంచి శాలరీ..
గౌతమ్ అదానీ 2024–25 లో అదానీ ఎంటర్ప్రైసెస్ లిమిటెడ్ నుంచి రూ. 2.26 కోట్ల శాలరీ అందుకున్నారు. అలవెన్స్, ఇతర బెనిఫిట్స్ విలువ 28 లక్షలు. మొత్తంగా రూ. 2.54 కోట్ల (2023–-24లో రూ.2.46 కోట్లు) రెమ్యూనిరేషన్ తీసుకున్నారు. అదానీ పోర్ట్స్ నుంచి రూ.1.80 కోట్ల శాలరీ, రూ.6.07 కోట్ల కమిషన్ తీసుకున్నారు. మొత్తం రూ. 7.87 కోట్లు (2023–-24లో 6.80 కోట్లు) అందుకున్నారు.
టాప్ కంపెనీల చైర్మన్ల జీతాలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (భారతదేశ అత్యంత ధనవంతుడు) కోవిడ్-19 తర్వాత నుంచి శాలరీ తీసుకోవడం లేదు. అంతకు ముందు ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున తీసుకునేవారు. ఇతరుల్లో సునీల్ భారతి మిట్టల్ (భారతి ఎయిర్టెల్ చైర్మన్) రూ.32.27 కోట్లు (2023–-24లో), రాజీవ్ బజాజ్ (బజాజ్ ఆటో చైర్మన్) రూ.53.75 కోట్లు (2023–-24), పవన్ ముంజాల్ (హీరో మోటోకార్ప్ చైర్మన్) రూ. 109 కోట్లు (2023-–24), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ రూ.76.25 కోట్లు (2024–-25 లో), ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్ రూ. 80.62 కోట్లు అందుకున్నారు. అదానీ గ్రూప్లోని కొందరు ఎగ్జిక్యూటివ్స్ కూడా గౌతమ్ అదానీ కంటే ఎక్కువ శాలరీ తీసుకున్నారు.