- ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన హెల్ప్ డెస్కులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు. నామినేషన్ పత్రాల దాఖలును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ సిబ్బంది అవసరమైన సాయం అందించాలన్నారు.
అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందించడంలో హెల్ప్ డెస్కుల పాత్ర ప్రధానమైనదని చెప్పారు. అశ్వాపురం మండలంలోని పలు గ్రామపంచాయతీలలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను వ్యయ పరిశీలకురాలు లావణ్య పరిశీలించారు. నామినేషన్ల స్వీకరించే విధానాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు ఖర్చులను ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రకారంగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు ఆఫీసర్లు ఇవ్వాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలని చెప్పారు.
