
- స్మార్ట్ మల్టీ లెవెల్ పార్కింగ్ వచ్చేసింది
- కేబీఆర్ పార్కు వద్ద ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కు వద్ద అత్యాధునిక స్మార్ట్ మల్టీ- లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి వచ్చింది. 10 రోజుల ట్రయల్ రన్ను ఆదివారం ప్రారంభించారు. త్వరలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. కేబీఆర్ పార్క్కు వచ్చే వాకర్స్ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రోడ్డుపై భారీగా కార్లను నిలుపుతున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
సమస్యను పరిష్కరించడానికి మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకు కోట్ల రూపాయల ఖర్చయ్యే అవకాశం ఉండడంతో పీపీపీ మోడ్లో టెండర్లు పిలిచి నవ నిర్మాణ్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. నిర్మాణంతో పాటు పదేండ్ల నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకొని పూర్తి చేసింది. పార్కింగ్ కోసం నామినల్ ఫీజులను ఈ సంస్థ కలెక్ట్ చేయనుండగా, వాటిని ఇంకా ఫైనల్ చేయలేదు.
ఇవీ ప్రత్యేకతలు
పార్క్ ఎంట్రెన్స్ వద్ద 400 గజాల్లో కొరియన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లో ఒకేసారి 72 కార్లు పార్కింగ్ చేయొచ్చు. ఆటోమేటెడ్ సెన్సార్లు, లిఫ్టుల సహాయంతో వాహనాలను వేగంగా, సమర్థవంతంగా పై, కింది అంతస్తుల్లోకి తరలించవచ్చు.