
- ఎంపీ ఎలక్షన్లతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- దేశంలో మొత్తం ఓటర్లు 97.8 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, నామిషన్లకు10 రోజుల ముందు ఏప్రిల్14 వ తేదీ వరకు ఓటరు నమోదుకు చాన్స్ ఉన్నదని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉంటుందని తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి బై పోల్ మే 13న నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఫేక్ ఓట్లు లేకుండా చేశామని, అసెంబ్లీ ఎన్నికల్లోనే రిగ్గింగ్ కు ఎక్కడా అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల గడువు ఉంటుందని, 26న స్క్రూటినీ, 29న విత్ డ్రా కి సమయం, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటాయని వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు - 23,30,574, మహిళలు 22,39,240, థర్డ్ జెండర్ - 324 మంది, 402 మంది సర్వీసు ఓటర్లు, 846 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లోనూ 85 ఏండ్లకు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం ఉన్నదని చెప్పారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 3,986 ఉండగా 1,675 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 6,217, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కోసం 495 వీవీ ప్యాట్ లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రతీ లిక్కర్ ఔట్ లెట్స్ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
హెల్ప్ లైన్ నంబర్ 1950 ద్వారా ఓటరు కి సంబంధించిన ఫిర్యాదులు, ఓటు సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. సీ- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వంద నిమిషాల్లో అధికారులు స్పందిస్తారని చెప్పారు. పొలిటికల్ పార్టీలు సువిధా పోర్టల్ లో ర్యాలీలు, రాస్తారోకోలు, సభల అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం, లౌడ్ స్పీకర్లకు అనుమతి ఉంటుందన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రెడ్డి
ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సీఏపీఎఫ్ బలగాలు గ్రౌండ్ లోకి వచ్చాయని, మొత్తం కేంద్రప్రభుత్వానికి చెందిన13 కంపెనీలు వస్తాయని, ఇప్పటికే 6 కంపెనీలు వచ్చాయని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేశాయని, ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కు రెండింటి చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ బృందాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లకు నోడల్ అధికారిగా సీపీ ఉంటారని, బైండోవర్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో మొన్నటి ఎన్నికల్లో 36 కోట్ల క్యాష్ సీజ్ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.