పార్కులను పట్టించుకోవట్లే.. కోట్లలో ఖర్చు చేస్తున్నా సక్కగ ఉండట్లే

పార్కులను పట్టించుకోవట్లే..  కోట్లలో ఖర్చు చేస్తున్నా సక్కగ ఉండట్లే
  • సరైన మెయింటెనెన్స్ లేక ఆగమాగం 
  • సిటీలో చాలా చోట్ల ఇదే పరిస్థితి
  • ఫిర్యాదులు వస్తున్నా స్పందించని అధికారులు


హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలోని  పార్కుల మెయింటెనెన్స్​కు  బల్దియా రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. మొత్తం 938 పార్కులు ఉండగా.. ఇందులో 19 మేజర్ ,919 కాలనీలకు చెందినవి ఉన్నాయి. వీటిలో వందకుపైగా పార్కులను బల్దియా మెయింటెనెన్స్​చేస్తుండగా,  మరికొన్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు. మిగతా 7,22 కాలనీల పార్కులను కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లకు ఇచ్చారు. దీంతో వాటి పూర్తి బాధ్యతలను చూస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రతి ఏటా రూ.15 కోట్లను ఖర్చు చేస్తుంది. మెయింటెనెన్స్‌‌‌‌కు ఒక్కో పార్కు విస్తీర్ణాన్ని బట్టి ఏడాది రూ.40 వేల నుంచి రూ. కోటికిపైగా ఖర్చు చేస్తుంది.  

ఇందులో 75 శాతం వాటాను బల్దియా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు అందిస్తుంది. జీహెచ్ఎంసీ ఫండ్స్​ని కేటాయిస్తుంది. అయినా.. పార్కుల నిర్వహణ సక్రమంగా లేక  వాకర్స్ కు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్నింటిలో  వాకింగ్ ట్రాక్ లు కూడా సరిగా లేవు. చెత్త చెదారం నిండిపోయి కనిపిస్తున్నా పట్టించుకునే వారు లేరు. కొన్ని పార్కుల ప్రహరీలు కూలి పడినా అటువైపు చూసి మరమ్మతులు చేయడంలేదు. కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందని కాలనీల వాసులు పేర్కొంటున్నారు. పార్కులు సరిగా లేక రోడ్లపైనే వాకింగ్ చేస్తున్నామని సిటిజన్లు చెబుతున్నారు. 

వీఐపీలు ఉండే ప్రాంతాల్లో.. 

వీఐపీలు ఉండే ప్రాంతాల్లోని పార్కులపైనే బల్దియా అధికారులు ఫోకస్ పెడుతున్నారు. సాధారణ పౌరులు ఉండే కాలనీల్లో పట్టించుకోవడంలేదు.   గ్రేటర్​లో  అధికంగా కేబీఆర్ పార్కు కోసం ఏడాదికి రూ. కోటి 15 ల‌‌‌‌క్షలు ఖర్చు చేస్తుంది. జ‌‌‌‌ల‌‌‌‌గం వెంగ‌‌‌‌ళరావు పార్కుకు రూ.32 ల‌‌‌‌క్షలు, లోట‌‌‌‌స్ పాండ్ పార్కుకు 20 ల‌‌‌‌క్షలు, జూబ్లీహిల్స్‌‌‌‌లోని హెర్బల్ గార్డెన్ కు రూ.14 లక్షలు... ఇలా వీఐపీలు ఉండే ప్రాంతాల్లోని వాటిపైనే ఎక్కువగా ఖర్చు పెడుతుంది.  వీఐపీలు ఉండే పార్కులపై ఎప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.  కాలనీల్లో పూర్తిగా ఖరాబ్ అయినా మరమ్మతులు చేయరు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్​ లో ఉండే పార్కులు క్లీన్ గా  ఉంటుండగా  కొద్దిదూరంలోని మాసబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో మాత్రం చెత్తా చెదారంతో నిండిపోయి ఉంటుంది. 

పూర్తిగా ఖరాబైనా.. 

సిటీలోని చాలా కాలనీల్లో పార్కుల మెయింటెనెన్స్​ లేదు.  కొన్ని పార్కుల్లో పాములు, కుక్కలతో జనం  భయపడుతున్నారు. పార్కుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో వాకర్స్ ఇబ్బందిగా మారింది. కొన్నిచోట్ల పాములు కూడా వస్తున్నాయని బల్దియాకు ఫిర్యాదులు చేస్తున్నారు.  వందలాది పార్కుల్లో క్లీన్ గా లేకపోగా వచ్చేందుకు జనం జంకుతున్నారు. మరోవైపు పార్కులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వాకింగ్ ట్రాక్​లు, రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోట్లేదు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా స్పందించడంలేదని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.  బల్దియా ఇచ్చే ఫండ్స్ వాచ్ మెన్ శాలరీకి కూడా సరిపోవడంలేదని అంటున్నారు.