
- ఇందిరా మహిళా శక్తి పేరుతోబతుకమ్మ లోపు పంచనున్న బల్దియా
- హ్యాండ్ లూమ్స్ డిపార్టుమెంట్ నుంచి జీహెచ్ఎంసీకి చేరిన ఐదు లక్షల చీరలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చేవారం నుంచి గ్రేటర్లో చీరలను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ పండుగకి ముందుగానే చీరలను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ హ్యాండ్ లూమ్స్ డిపార్టుమెంట్ నుంచి సోమవారం జీహెచ్ఎంసీకి చీరలు చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ చీరలను అందజేయనున్నారు. మొత్తం గ్రేటర్ లో 49,714 గ్రూప్ లు ఉన్నాయి.
ఒక్కో గ్రూప్ లో 10 మంది చొప్పున మహిళలు ఉన్నారు. మొత్తం జీహెచ్ఎంసీకి 5 లక్షల చీరలు వచ్చాయి. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందుగానే ఈ చీరల పంపిణీ జరగనుంది.
అయితే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈసారి రూ.800 ఖరీదు చేసే చీరలు పంపిణీ చేస్తుంది. ప్రతి చీరకు ప్రత్యేకంగా ఓ కవర్ లో అందిచనున్నారు. అయితే బతుకమ్మ పండుగకి ముందుగా ఒక చీర పంపిణీ చేస్తుండగా, సంక్రాంతికి కూడా మరో చీర అందించనున్నట్లు తెలిసింది.