- ప్రభుత్వానికి 4.5 లక్షల రెమిడిసివిర్ వయల్స్ విరాళం
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయం చేయడానికి ఫార్మా కంపెనీ గలియడ్ సైన్సెస్ ముందుకొచ్చింది. రెమిడెసివిర్ తయారీ చేయడానికి లైసెన్స్ తీసుకున్న ఇండియన్ కంపెనీలకు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ల (ఏపీఐ)ను డొనేట్ చేస్తామని ప్రకటించింది. దీనికి తోడు ఈ కంపెనీలకు టెక్నికల్ సాయాన్ని అందిస్తామని, కొత్త మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలను పెడితే సపోర్ట్ చేస్తామని తెలిపింది. వీటికి అదనంగా ప్రభుత్వానికి 4.5 లక్షల రెమ్డిసివిర్ వయల్స్(వెక్లరీ బ్రాండ్)ను విరాళం చేస్తామని ప్రకటించింది.
కరోనా కేసుల వల్ల హెల్త్ సిస్టమ్పై ఎక్కువ ఒత్తిడి పడుతోందని గలియడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జోహన్నా మెర్సియర్ అన్నారు. ‘కరోనాను కట్టడి చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇండియాలో రెమెడిసివిర్ అవసరం ఉన్న పేషెంట్లకు వీలున్నంత తొందరగా సాయం చేస్తాం. దీని కోసం ప్రభుత్వం, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మా నుంచి లైసెన్స్ తీసుకున్న కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం’ అని జోహన్నా చెప్పారు. రెమిడిసివిర్ మెడిసిన్స్ను తయారు చేయడానికి ఏడు భారత కంపెనీలు గలియడ్తో లైసెన్స్ కుదుర్చుకున్నాయి. ‘గలియడ్ వాలంటరీ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ ద్వారా సుమారు 60కి పైగా పేద దేశాల్లోని 230 కోట్ల మందికి రెమిడిసివిర్ అందుబాటులోకి వచ్చింది’ అని గలియడ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ ప్రోగ్రాంమ్ కింద 9 కంపెనీలకు లైసెన్స్లు దక్కాయి. ఇందులో ఏడు కంపెనీలు ఇండియాలోనే ఉండటం విశేషం.