
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరుటి కంటే పెరిగిన పాస్ పర్సంటేజీ
- సత్తా చాటిన నాగర్కర్నూల్ జిల్లా విద్యార్థులు
మహబూబ్నగర్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో మాదిరిగానే టెన్త్ రిజల్ట్స్లోనూ అమ్మాయిలు అదరగొట్టారు. బాయ్స్ కంటే బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో 45,269 మంది స్టూడెంట్లు పరీక్ష రాయగా.. 42,201 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,068 మంది ఫెయిల్ అయ్యారు.
పది స్థానాలకు ఎగబాకిన నాగర్కర్నూల్..
టెన్త్ రిజల్ట్స్లో నాగర్కర్నూల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో ఈ జిల్లా చివరి స్థానంలో నిలవగా.. టెన్త్లో మాత్రం 13వ స్థానానికి చేరుకుంది. గతేడాది 91.57 శాతం ఉత్తీర్ణతతో 23వ స్థానంలో నిలువగా.. ఈ సారి పది స్థానాలకు ఎగబాకి 13వ స్థానానికి చేరుకుంది. జిల్లా నుంచి 10,530 మంది పరీక్షలు రాయగా.. 96.83 శాతంతో 10,196 మంది పాస్ అయ్యారు. వీరిలో బాలురు 5,013 మంది ఉండగా.. 5,183 మంది బాలికలు ఉన్నారు. బాలురు కంటే 170 మంది ఎక్కువ బాలికలు పాస్ అయ్యారు.
నాలుగు జిల్లాల్లో ఇలా..
నారాయణపేట జిల్లాలో 7,618 మంది పరీక్షలు రాయగా, 95.18 శాతంతో 7,251 మంది పాస్ అయ్యారు. వీరిలో 3,344 మంది బాలురు, 3,907 మంది బాలికలు ఉన్నారు. మహబూబ్నగర్లో 12,737 మంది పరీక్షలకు అటెండ్ కాగా, 91.91శాతంతో 11,706 మంది పాస్ అయ్యారు. జిల్లాలో బాలికల కంటే బాలురు ఎక్కువగా పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన 11,706 మందిలో బాలికలు 5850, బాలురు 5856 మంది ఉన్నారు.
గద్వాల జిల్లాలో 7,569 మంది పరీక్షలు రాయగా.. 91.74 శాతంతో 6,944 మంది పాస్ అయ్యారు. వీరిలో 3364 బాలురు, 3580 మంది బాలికలు ఉన్నారు. 215 మంది బాలికలు బాలురు కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించారు. వనపర్తి జిల్లాలో 6,842 మంది పరీక్షలు రాయగా, 89.21శాతంతో 6,104 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,982 మంది ఉండగా.. బాలికలు 3,122 మంది ఉన్నారు. దీని ప్రకారం బాలురు కంటే 140 మంది బాలికలు ఎక్కువగా పాస్ అయ్యారు.
24వ స్దానానికి ఎగబాకిన పాలమూరు..
ఎనిమిదేండ్లుగా మహబూబ్నగర్ జిల్లాలో టెన్త్ రిజల్ట్స్ 89 శాతం దాటడం లేదు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జిల్లా 91.91 శాతంతో 11,706 మంది పాస్ అయ్యారు. గతేడాది జిల్లా 28 స్థానంలో ఉండగా, ఈ సారి నాలుగు స్థానాలు పైకి ఎగబాకింది. దీంతో 24వ స్థానంలో నిలిచింది. నారాయణపేట జిల్లాలో కూడా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది 93.13 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి ఏకంగా 95.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.