- మేయర్గా 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి
- డిప్యూటీ మేయర్గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నిక
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ కార్పొరేషన్పై 20 ఏండ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగిరింది. సోమవారం నిర్వహించిన ఎన్నికలో ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి మేయర్గా ఎన్నికైంది. పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పోస్ట్ను ఎంఐఎంకు ఇవ్వగా.. ఆ పార్టీ 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ విజయం సాధించారు.
ఉత్కంఠకు తెరదించుతూ ..
నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. 28 స్థానాల్లో బీజేపీ క్యాండిడేట్లు విజయం సాధించారు. 17 డివిజన్లలో కాంగ్రెస్, 14 డివిజన్లలో మజ్లిస్ క్యాండిడేట్లు గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క క్యాండిడేట్ సైతం కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. దీంతో మజ్లిస్తో పాటు ఎమ్మెల్సీ మహేశ్గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఎక్స్అఫీషియో ఓట్లతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిజల్ట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ కార్పొరేటర్లందరినీ బెంగళూరు క్యాంప్నకు తీసుకెళ్లారు.
సోమవారం మేయర్ ఎన్నిక ఉండడంతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్యాట విజయలక్ష్మితో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లంతా నిజామాబాద్లోని ఓ హోటల్కు చేరుకున్నారు. అక్కడ ఎన్నిక టైంలో వ్యవహరించాల్సిన తీరును టీపీసీపీ మహేశ్కుమార్గౌడ్ వారికి వివరించారు. తర్వాత రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో పాటు అందరూ ఒకే బస్సులో కార్పొరేషన్ ఆఫీస్కు వచ్చారు. మజ్లిస్ పార్టీకి చెందిన 14 మంది సైతం అప్పటికే చేరుకున్నారు.
మరో వైపు బీజేపీ ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి తమ 28 మంది కార్పొరేటర్లతో మీటింగ్హాల్కు చేరుకున్నారు. ముందుగా కార్పొరేట్లందరితో ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభించారు. ఎన్నికకు దూరంగా ఉంటుందని భావించిన బీజేపీ సైతం తమ క్యాండిడేట్లను పోటీకి దింపడంతో కొంత టెన్షన్ మొదలైంది.
మేయర్ స్థానానికి కాంగ్రెస్ తరఫున 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి పోటికి దిగగా.. బీజేపీ తరఫున గోపిడి స్రవంతిరెడ్డి బరిలోకి దిగింది. దీంతో ఓటింగ్ నిర్వహించగా.. ఉమారాణికి 34 ఓట్లు, స్రవంతిరెడ్డికి 31 ఓట్లు వచ్చాయి. అలాగే డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం మజ్లిస్ తరఫున 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్, బీజేపీ తరఫున బంటు రాము పోటీ పడ్డారు. ఇందులో సల్మా తహసీన్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ ప్రకటించారు.
20 ఏండ్ల తర్వాత...
నిజామాబాద్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యాక 2005లో మొదటి సారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అప్పటి టీపీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ పెద్దకొడుకు సంజయ్ తొలి మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014, 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ల్ విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు 20 ఏండ్ల తర్వాత నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్కు దక్కగా... ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కూరగాయల ఉమారాణి మేయర్గా ఎన్నికైంది. ఆమె భర్త కరాటే రమేశ్ ఓ ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్స్కు మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తుంటాడు. టైలరింగ్ పనిచేసే ఉమారాణి అనూహ్య రీతిలో కార్పొరేటర్గా గెలిచి.. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. నిజామాబాద్ మేయర్ పోస్ట్ వరుసగా మూడోసారి కూడా మహిళకే దక్కింది.
