హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ వెంట పర్యాటక శాఖ ఎండీ మనోహర్రావు తిరుమల వెళ్లిన వివాదంపై హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. కోడ్ ముగిసినందున మనోహర్పై వచ్చిన అభియోగాలపై విచారణ పూర్తి చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్టేటప్ రిపోర్టు సమర్పించాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
టూరిజం ద్వారా వెళ్లే వాళ్లకు తిరుమల దర్శనం టిక్కెట్ల సంఖ్య 300 నుంచి 500లకు పెంపు చేయాలని కోరేందుకు మనోహర్ తిరుమల వెళ్లినట్లు పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ శ్రీరఘురాం చెప్పారు. ఎండీ ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఈసీకి సస్పెండ్ చేసే అధికారం లేదని వెల్లడించారు. ఎలక్షన్ల కోడ్ ఆదివారంతో ముగిసిందని, ఈ వ్యవహారంపై డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ చేసి నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు ఈసీ తరఫు సీనియర్ లాయర్ దేశాయ్ అవినాశ్ చెప్పారు. దీంతో డివిజన్ బెంచ్ స్పందిస్తూ తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.