హైదరాబాద్, వెలుగు: లడ్నాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం సింగరేణి కాలరీస్ సేకరించిన భూముల్లో ఇండ్లు కట్టుకున్న 280 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపు విషయంపై లబ్ధిదారులతో చర్చలు జరపాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆదివారం సెక్రటేరియెట్లో సింగరేణి సీఎండీ బలరాం, పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, సింగరేణి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.
లడ్నాపూర్లో ఓపెన్ కాస్ట్ మైన్ కోసం 2012లో సింగరేణి సంస్థ 103 ఎకరాల భూమి సేకరించింది. అందులో 466 ఇండ్లకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 722 మందికి రూ.7.5 లక్షల చొప్పున చెల్లించింది. ప్రజల పునరావాసం కోసం సింగరేణి రూ.145 కోట్లు విడుదల చేసింది. అయితే, సింగరేణి సేకరించిన ఆ భూమిలో 1400 మంది ఇండ్లు కట్టుకుని పరిహారం కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు చొరవతో వారికి రూ.30 కోట్ల పరిహారాన్ని సింగరేణి అందించింది.
