అవయవదానంతో ముగ్గురికి లైఫ్​ ఇచ్చిండు

అవయవదానంతో ముగ్గురికి లైఫ్​ ఇచ్చిండు
  • అవయవదానంతో ముగ్గురికి లైఫ్​ ఇచ్చిండు
  • బ్రెయిన్ డెడ్  అయిన యువకుడి  ఆర్గాన్స్ డొనేషన్   
  • కుటుంబసభ్యులను ఒప్పించిన  పేస్ హాస్పిటల్ డాక్టర్లు 

హైదరాబాద్, వెలుగు: యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్​డెడ్​కు గురైన ఓ యువకుడు అవయవ దానంతో ముగ్గురికి లైఫ్​నిచ్చాడు. ఇందుకోసం యువకుడి కుటుంబీకులను హైటెక్​సిటీలోని పేస్​హాస్పిటల్ డాక్టర్లు ఒప్పించారు.  జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడు(19) కొద్దిరోజుల కిందట రోడ్ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో అతడిని వరంగల్​లోని ఎంజీఎం హాస్పిటల్​లో చేర్చారు. ఆపై మైరుగైన ట్రీట్​మెంట్​కోసం హైటెక్​సిటీలోని పేస్​హాస్పిటల్​కు తీసుకొచ్చారు. కాగా అతడిని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తలకు బలమైన గాయం కారణంగా అతడు బ్రెయిన్​డెడ్​అయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

కాగా మృతుడి అవయవాలతో ఇతరులను బతికించవచ్చని అతడి కుటుంబీకులకు అర్థమయ్యేలా చెప్పిన డాక్టర్లు ఆర్గాన్​డొనేషన్​కు వారిని ఒపించారు. తమ హాస్పిటల్​లోనే చికిత్స పొందుతున్న ఓ 50 ఏండ్ల పేషెంట్​కు లివర్, మరో 50 ఏళ్ల వ్యక్తికి కిడ్నీని విజయవంతంగా అమర్చారు. వారు కోలుకుంటున్నట్లు పేస్ హాస్పిటల్​మేనేజ్​మెంట్ ఓ ప్రకటనలో​తెలిపింది. మరో కిడ్నీని ట్రాన్స్​ప్లాంటేషన్​కోసం నిమ్స్​హాస్పిటల్​కు తరలించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యువకుడి కుటుంబీకులకు లివర్​ట్రాన్స్​ప్లాంట్​సర్జన్​డాక్టర్​ఫణి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.