విద్యుత్ వాహనాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ లేదా హైబ్రిడ్ కార్లను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఐరోపా సంఘ దేశాల్లో విక్రయమైన ప్రతి ఐదు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ రకానిదే. అమెరికాలో ప్రతి పది కార్లలో అలాంటిది ఒకటి ఉంది.
2024లో ఆయా దేశాల్లో అమ్ముడైన మొత్తం కార్లలో విద్యుత్, హైబ్రిడ్ రకానికి చెందినవి నార్వేలో ఏకంగా 92 శాతం ఉన్నాయి. ఇండియాలో అతి తక్కువగా రెండు శాతం మాత్రమే ఉన్నాయి. స్వీడన్లో 58 శాతం, చైనాలో 48, యూకేలో28, స్విట్జర్లాండ్ లో 28, ఐరోపా సంఘ దేశాల్లో 21, కెనడాలో 17, ఆస్ట్రేలియాలో 13, అమెరికాలో పది, దక్షిణ కొరియాలో తొమ్మిది, బ్రెజిల్లో ఆరు, జపాన్లో మూడు శాతం ఉన్నాయి. ఈ వివరాలను 2025 ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకటించింది.
పెరుగుతున్న విద్యుత్ వాహనాలు
తెలంగాణలో విద్యుత్ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. వీటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వినియోగ శాతం పెరిగింది. ఈ విధానం తీసుకొచ్చిన కొత్తలో రాష్ట్రం మొత్తం మీద 4,376 వరకూ విద్యుత్ వాహనాలు ఉండగా ఇప్పుడా సంఖ్య 2,58,325 కి పెరిగింది. 2030 నాటికి ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం, బస్సుల్లో 40 శాతం, కార్లలో 30 శాతానికి పైగా విద్యుత్ వాహనాలే ఉంటాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.
విద్యుత్ వాహనాల వినియోగం వల్ల కూడా లాభం, నష్టం రెండూ ఉన్నాయి. తక్కువ ధరకు దొరుకుతాయి. మరమ్మతులకు అవకాశం తక్కువ. పెట్రోల్తో పని లేదు. ఫలితంగా కాలుష్య భయం ఉండదు. శబ్ద కాలుష్యానికి చోటు అతి తక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి వెయ్యిమందిలో 80 మందికి సొంత కార్లు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల్లో మనదేశం మూడో స్థానంలో ఉంది. కేంద్రం విద్యుత్ వాహనాలపై జీఎస్టీని భారీగా తగ్గించింది.
- జి. యోగేశ్వరరావు,జర్నలిస్ట్
