
- పాఠశాలల్లో ఫుడ్, బేవరేజెస్పై కఠిన నిబంధనలు
- 17 స్కూల్స్లోనే కరిక్యులమ్లో పోషకాహార విద్య
- యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్మానిటరింగ్ రిపోర్ట్లో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లోని స్కూళ్లలోనే పిల్లలకు ఆరోగ్యకర ఆహారం అందుతున్నది. ఈ పాఠశాలల్లో ఆహార, పానీయాలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. పిల్లలకు పోషకాహారం అందించడంపై పాఠశాలలు, ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి. మిగతా 40 దేశాల్లోని స్కూళ్లలో పిల్లలకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో అనారోగ్యకర ఆహారం అందుతున్నది. ఈ వివరాలు యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్లో వెల్లడయ్యాయి.
ఈ నివేదికను ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’ నేతృత్వంలోని ‘రీసెర్చ్ కన్సార్టియం ఫర్ స్కూల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్’ పరిశోధన నిర్వహించి ప్రచురించాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. 187 దేశాల్లో 93 కంట్రీస్లోని పాఠశాలల్లో మాత్రమే ఫుడ్, బెవరేజెస్పై తప్పనిసరి మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులోని 29 శాతం దేశాల్లోని పాఠశాలల్లో అనారోగ్యకర ఆహార, పానీయాలను నిషేధించే కఠిన నిబంధనలున్నాయి.
50% కంటే ఎక్కువ స్కూల్స్లో పోషకాహారలోపం
ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కంటే ఎక్కువ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్లో పండ్లు, కూరగాయలు తగినంతగా లేవని రిపోర్ట్లో వెల్లడైంది. అంటే ఈ స్కూళ్లలో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్నది. మూడింట ఒక వంతు స్కూళ్లలో చక్కెరతో కూడిన డ్రింక్స్ను అందిస్తున్నారని, ఇది పిల్లల్లో ఒబేసిటీతోపాటు ఇతర అనారోగ్య సమస్యలను తీసుకొస్తున్నట్టు రిపోర్ట్లో తేలింది. గత రెండు దశాబ్దాల్లో 100కు పైగా దేశాల్లోని చిన్నారుల్లో ఊబకాయం రెట్టింపైంది. అలాగే 30 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. స్కూళ్లలో పోషకాహార విద్యను ఎక్స్ట్రా కరిక్యులర్ లేదా ప్రాజెక్ట్ బేస్డ్ ప్రోగ్రామ్లాగా మాత్రమే అందిస్తున్నారు.
అంటే కరిక్యులమ్లో దీన్ని భాగం చేయడం లేదు. 17 దేశాలు మాత్రమే పోషకాహార విద్యను కరిక్యులమ్లో చేర్చారు. 161 దేశాల్లో 418 మిలియన్ల మంది పిల్లలు స్కూల్ మీల్స్ ప్రోగ్రామ్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. భారత్లో పీఎం పోషణ్ స్కీమ్ ద్వారా రోజూ 118 మిలియన్ల మంది చిన్నారులకు ఆహారం అందుతున్నది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్లలో ఒకటిగా గుర్తింపు పొందినా.. ఆహార వైవిధ్యం లేకపోవడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపాలు ఉన్నట్టు రిపోర్ట్లో తేలింది.