గోదావరి కావేరి లింక్ లో సగం వాటా ఇవ్వాలి.. మేం ఎక్కడైనా వాడుకుంటామన్న తెలంగాణ

గోదావరి కావేరి లింక్ లో సగం వాటా ఇవ్వాలి..  మేం ఎక్కడైనా వాడుకుంటామన్న తెలంగాణ

గోదావరి కావేరి లింక్​లో భాగంగా తరలించే 148 టీఎంసీల జలాల్లో సగం వాటా (74 టీఎంసీలు) ఇవ్వాలని రాహుల్​ బొజ్జా డిమాండ్​ చేశారు. జీసీ లింక్​ను తెలంగాణ భూభాగం నుంచే చేపడుతున్నా.. కేవలం 45 టీఎంసీలే కేటాయించారని అన్నారు. కాబట్టి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని సగం వాటా ఇవ్వాలని కోరారు. అయితే, రాష్ట్ర విజ్ఞప్తిని ఎన్​డబ్ల్యూడీఏ తిరస్కరించింది. సగం వాటా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కాగా, ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్​ను చేపడితే.. పలు షరతులతో చేపట్టాలని రాహుల్​బొజ్జా ఎన్​డబ్ల్యూడీఏ చైర్మన్​కు సూచించారు. 

తొలుత తమకు గోదావరిలో కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి రక్షణ కల్పించాలన్నారు. 148 టీఎంసీల తరలింపునకు చత్తీస్​గఢ్​ నుంచి నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​తీసుకోవాలన్నారు. జీసీ లింక్​తో దేవాదుల లిఫ్ట్​లో 38.16 టీఎంసీలు, సమ్మక్కసాగర్​లో 46.96 టీఎంసీలు, సీతమ్మసాగర్​– సీతారామ లిఫ్ట్​ ప్రాజెక్టుల్లో 67.05 టీఎంసీలు కలిపి 152.17 టీఎంసీల నీటి వినియోగానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలని, వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే సమ్మక్కసాగర్​ ప్రాజెక్టుపై ప్రభావం పడకుండా చూడాలని, అందుకు అనుగుణంగా గేట్​ ఆపరేషన్​ ప్రొటోకాల్​ షెడ్యూల్​పై సిమ్యులేషన్​ స్టడీస్​ చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి జీసీ లింక్​లో ఇచ్చే వాటాతో పాటు రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు 200 టీఎంసీలు ఇచ్చంపల్లి నుంచి వాడుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. 

ఎక్కడైనా వాడుకుంటం..

తెలంగాణ కోటా కింద ఇచ్చే నీళ్లను శ్రీరాంసాగర్​ లేదా దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకు వాడుకోవాలన్న రూల్స్​ను ఎన్​డబ్ల్యూడీఏ పెడుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర సర్కారు అందుకు అంగీకరించలేదు. ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా తమకు స్వేచ్ఛనివ్వాలని రాహుల్​బొజ్జా స్పష్టం చేశారు. జీసీ లింక్​లో భాగంగా కృష్ణా బేసిన్​లో అవసరమున్న చోట రెండు రిజర్వాయర్లను కట్టివ్వాలని, ఆయా రిజర్వాయర్లకు నీటి తరలింపు వ్యవస్థలను నిర్మించాలని కోరారు. జీసీ లింక్​లో భాగంగా సాగర్​కు నీటిని తరలించే కన్వేయర్​ సిస్టమ్​లో చాలా వరకు వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఆ ముంపును తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

తరలించే నీటిని నేరుగా నాగార్జునసాగర్​ ప్రాజెక్టులోకి తీసుకెళ్లవద్దని, సాగర్​ టెయిల్​పాండ్​కు తరలించి అక్కడి నుంచి తీసుకెళ్లాలని సూచించారు. సాగర్​లోకి నీటిని తరలిస్తున్నందున అక్కడ రీప్లేస్​మెంట్​కు బదులుగా కర్నాటకకు ఆల్మట్టిలో అదనంగా 16 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దాని వల్ల తెలంగాణకు గేట్​వే ప్రాజెక్ట్​ అయిన జూరాలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్​ నుంచి రీప్లేస్​మెంట్​అన్నారే తప్ప ఎలా అనే వివరాలను మాత్రం చెప్పలేదన్నారు. ఈ నిర్ణయంపై పునఃసమీక్షించాలన్నారు. అన్ని రాష్ట్రాలూ సమ్మతించాకనే మెమోరాండమ్​ఆఫ్​ అగ్రిమెంట్​పై ముందుకు వెళ్లాలని, ఇప్పుడే చేస్తే అది తొందరపాటే అవుతుందని స్పష్టం చేశారు.