- 45 బిలియన్ డాలర్లను టచ్ చేసిన దిగుమతుల విలువ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ గోల్డ్ దిగుమతులు భారీగా పెరిగాయి. కిందటేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య గోల్డ్ దిగుమతులు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ డేటా ద్వారా తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్లో దేశ గోల్డ్ దిగుమతులు కేవలం 26.11 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మాత్రం గోల్డ్ ఇంపోర్ట్స్ 11.45 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయని కామర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. గోల్డ్ దిగుమతులు పెరగడంతో దేశ కరెంట్ అకౌంట్ లోటు(దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) కూడా విపరీతంగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2020–21 లోని ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య దేశ కరెంట్ అకౌంట్ లోటు 89 బిలియన్ డాలర్లుగా నమోదవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే టైమ్లో ఈ లోటు 176 బిలియన్ డాలర్లకు ఎగిసింది. చైనా తర్వాత ఎక్కువగా గోల్డ్ను దిగుమతి చేసుకుంటోంది ఇండియానే. ముఖ్యంగా దేశంలోని జ్యువెలరీ ఇండస్ట్రీ నుంచి డిమాండ్ పెరగడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య గోల్డ్ దిగుమతులు సగటున నెలకు 76.57 టన్నులుగా ఉన్నాయని, ముందు ఆర్థిక సంవత్సరాల్లోని ఇదే టైమ్తో పోలిస్తే ఇది తక్కువేనని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ కొలిన్ షా పేర్కొన్నారు. గోల్డ్ దిగుమతులు ఈ ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య 842.28 టన్నులుగా ఉన్నాయి.