‘దుబాయ్ టూర్ పేరుతో ఓల్డ్ సిటీకి చెందిన షెహబాజ్, శ్రీనగర్ కాలనీకి చెందిన అయాజ్, సనత్నగర్కు చెందిన ఫహాద్ను గోల్డ్ మాఫియా ట్రాప్ చేసింది. టికెట్స్, షెల్టర్,ఖర్చులకు డబ్బులు ఇచ్చి దుబాయ్ పంపింది. అక్కడ గోల్డ్ మాఫియాకు చెందిన ఏజెంట్లు వారిని రిసీవ్ చేసుకున్నారు. 15 రోజుల తర్వాత వారి కాళ్లకు బ్యాండేజ్ వేసి ఒక్కొక్కరికి 2 కిలోల చొప్పున 6 కిలోల గోల్డ్ పేస్ట్ను ప్యాక్ చేశారు. తర్వాత వారిని దుబాయ్ నుంచి సిటీకి పంపారు. వీరిలో అయాజ్, షెహబాజ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగా.. . ఫహద్ గోల్డ్ పేస్ట్తో ఎస్కేప్ అయ్యాడు. దీంతో అయాజ్, షెహబాజ్తో పాటు ఫహద్ కుటుంబ సభ్యులను గోల్డ్ మాఫియా కిడ్నాప్ చేసి మైలార్దేవ్పల్లి పరిధి శాస్త్రీపురంలో బంధించింది. ఫహద్ ఎక్కుడున్నాడో చెప్పాంలంటూ 4 రోజులు చిత్ర హింసలకు గురిచేసింది. అయాజ్, షెహబాజ్ పేరెంట్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు గురువారం శాస్త్రీపురం చేరుకుని వారిని విడిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గోల్డ్ మాఫియాకు చెందిన వారు తప్పించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్,వెలుగు: సిటీలో ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా గోల్డ్ మాఫియా బెదిరింపులు, కమీషన్ల కారణంగా క్యారియర్ల గురించి వివరాలు బయటికి రావడం లేదు. పేద, నిరుద్యోగ యువతను ట్రాప్ చేస్తున్న గోల్డ్ మాఫియా వారిని దుబాయ్ పంపి తిరిగి వచ్చేటప్పుడు కిలోల కొద్దీ బంగారం ప్యాక్తో రప్పిస్తున్నారు. తిరిగి ఇండియాకు వచ్చేటప్పుడు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒప్పుకుంటే కమీషన్ లేదంటే పాస్పోర్టులు తీసుకుని బెదిరిస్తున్నారు. ఇలాంటి క్యారియర్ నెట్వర్క్తో ఏటా సుమారు 50 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అడ్డాగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దుబాయ్,ఉమ్రా,అబుదాబితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లకు సైతం అక్కడే కమీషన్ల ఆశ చూపి ట్రాప్ చేసి వారితో సిటీకి గోల్డ్ను తరలిస్తున్నారు. సనత్నగర్లో జరిగిన గోల్డ్ మాఫియా గ్యాంగ్ దాడులు క్యారియర్స్ నెట్వర్క్ను మరోసారి బయటపెట్టాయి.
ఉమ్రా టూర్ ప్యాసింజర్లతో..
ముంబయి,చెన్నై,బెంగళూర్ తరహాలోనే సిటీలో ఏటా గోల్డ్ క్యారియర్స్ సంఖ్య పెరిగిపోతోంది. హవాలా వ్యాపారులు, హోల్సేల్ గోల్డ్ డీలర్స్ ప్రధాన సూత్రదారులు కాగా పేద కుటుంబాలకు చెందిన యువకులు క్యారియర్లుగా మారుతున్నారు. కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఉండే వారితో పాటు అరబ్ దేశాల్లో ఉండే సిటీకి చెందిన ఫ్యామిలీస్ , ట్రావెల్ ఏజెన్సీల డేటా బేస్ ఆధారంగా గోల్డ్ స్మగ్లర్లు స్కెచ్ చేస్తున్నారు. పేదరికంలో ఉన్న యువత, ఈజీమనీకి అలవాటు పడ్డ ఆవారాలను చైన్ సిస్టమ్తో ట్రాప్ చేస్తున్నారు.పాస్పోర్ట్, వీసా, షెల్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్లు ఇప్పించి అరబ్ దేశాలకు పంపిస్తున్నారు. ట్రావెల్స్ ఏజెంట్లతో కలిసి ఉమ్రా టూర్ ప్యాకేజీలతో మహిళలు, 50 ఏండ్లు దాటిన వారిని సైతం దుబాయ్, అబుదాబికి పంపి స్మగ్లింగ్కు వాడుకుంటున్నారు.
ఎయిర్పోర్టులో దిగగానే అలర్ట్..
గోల్డ్ మాఫియా ట్రాప్లో పడి సిటీ నుంచి దుబాయ్, ఉమ్రా, అబుదాబికి వెళ్లిన వారిని అక్కడి ఎయిర్ పోర్టులకు సమీపంలోని హోటల్స్లో స్మగ్లింగ్ గ్యాంగ్లోని ఏజెంట్లు కలుస్తున్నారు. తిరిగి వారిని ఇండియాకు పంపే టైమ్లో క్యారియర్లుగా మార్చి బంగారాన్ని తరలిస్తున్నారు. క్యారియర్లు ఆ బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులోని రిసీవర్స్, ఏజెంట్లకు అందిస్తున్నారు. గోల్డ్ తీసుకొస్తున్న క్యారియర్ ఫ్లైట్ టికెట్ నంబర్, ఫొటోను దుబాయిలోని ఏజెంట్.. వాట్సాప్ ద్వారా సిటీలోని గ్యాంగ్ సభ్యులకు చేరవేస్తాడు. ఎయిర్ పోర్టులో గోల్డ్ రిసీవర్ నంబర్ సైతం పంపిస్తాడు. ఇలా స్మగ్లింగ్ చేసిన క్యారియర్లకు ట్రిప్మీద రూ.15 వేల నుంచి రూ.25 వేలు కమీషన్ ఇస్తున్నారు.
ఏజెంట్లు దొరకరు..
గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మే నెల వరకు 12 మంది కార్యియర్లను కస్టమ్స్,డీఆర్ఐ అధికారులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. పేస్ట్, బిస్కెట్స్ రూపంలో తరలిస్తున్న సుమారు 13.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుల్లో ఓల్డ్ సిటీకి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ రిసీవర్స్ ఎవరో గుర్తించలేకపోయారు. క్యారియర్ల అడ్రస్ల వారీగా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సిటీలోని గోల్డ్ ఏజెంట్ల, హవాలా వ్యాపారులపై నిఘా పెట్టారు. ఉమ్రా నుంచి వచ్చే ప్యాసింజర్ల నుంచే పెద్ద మొత్లంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని ఆధారాలు సేకరించారు. సనత్నగర్లో జరిగిన గోల్డ్ మాఫియా దాడుల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులతో రాబడుతున్నారు.