
సోన్ భద్ర.. ఇటీవల టన్నుల కొద్దీ బంగారం నిక్షేపాలున్నట్టు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ప్రాంతం. అక్కడ టన్నుల కొద్దీ బంగారం లేదు, శుద్ధి చేస్తే వచ్చేది 160 కేజీలే అని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వివరణ ఇచ్చింది. అయితే ఎంత బంగారం ఉందన్న విషయం పక్కనపెడితే.. మన రాష్ట్రంలోనూ బంగారం నిక్షేపాలున్నాయని భావిస్తున్న ఊర్లు చాలానే ఉన్నాయన్న విషయం రాష్ట్ర మైనింగ్, జియాలజీ డిపార్ట్మెంట్ గతంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇట్ల నిక్షేపాలున్న చోట ఒక్కో టన్ను మట్టి నుంచి ఎన్ని గ్రాముల బంగారం ఉత్పత్తి చేయవచ్చన్నదే కీలకం. ఇందుకు సర్వే ఇవి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి.
ఐదు జిల్లాల్లోని ఊర్లలో..
రాష్ట్రంలో మహబూబ్నగర్, జోగులాంబ- గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు. జోగులాంబ –గద్వాల స్కిస్ట్ బెల్ట్, ఆత్కూర్– ధారూర్– దోర్నాల బ్లాక్, వనపర్తి జిల్లాలో బంగారు గనుల అన్వేషణకు జీఎస్ఐ ప్రతిపాదనలు కూడా చేసింది. అలాగే వజ్రాలు ఉండే డైమండిఫెరస్ కింబర్ లైట్ ఖనిజాలు భూగర్భంలో ఎక్కడున్నాయో అన్వేషించే పని కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం సూర్యాపేట జిల్లాలో ఎన్ఎండీసీతో మరోసారి సర్వే చేయించాలని భావిస్తున్నట్టు మైనింగ్, జియాలజీ డిపార్ట్మెంట్ గతేడాది వార్షిక రిపోర్టులో పేర్కొంది. వజ్రాలు, బంగారు నిక్షేపాల అన్వేషణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించేందుకు టీఎస్ఎండీసీ, ఎన్ఎండీసీ అధికారులు సంయుక్తంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
టన్ను మట్టిలో కనీసం 6 గ్రాములు వస్తేనే లాభం
ముడి బంగారం ఉన్నచోట ప్రతి టన్ను మట్టి నుంచి కనీసం 6 గ్రాముల శుద్ధిచేసిన బంగారం ఉత్పత్తి చేయగలగాలని, అంతకంటే తగ్గితే నష్టమేనని ఎన్ఎండీసీ అంచనా. ఒకవేళ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలను గుర్తించినా కనీస స్థాయిలో ఉత్పత్తి చేసే పరిస్థితి లేకపోతే వృథాయేనని టీఎస్ఎండీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.