
- ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,01,540
- హైదరాబాద్లో రూ.1,01,400
- వెండి ధరలూ పైకి.. జియో పొలిటికల్ టెన్షన్లు, ట్రంప్ పాలసీలే కారణం
న్యూఢిల్లీ: గోల్డ్కు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఒక వైపు గ్లోబల్ స్టాక్ మార్కెట్లు పడుతుండగా, బంగారం ధరలు మాత్రం వరుసగా మూడో రోజు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర శుక్రవారం ఒక్క రోజే రూ.2,200 పెరిగి 10 గ్రాములకు రూ.1,01,540కి చేరింది. ఇది రికార్డ్ హైకి దగ్గరగా ఉంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 22 క్యారెట్ల గోల్డ్ ధర శుక్రవారం రూ.1,900 పెరిగి 10 గ్రాములకు రూ.1,00,700 (టాక్స్లతో సహా) ను టచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న గోల్డ్ రేటు రూ.1,01,600 వద్ద లైఫ్ టైమ్ హైని రికార్డ్ చేసింది.
రికార్డ్ గరిష్టాల్లో వెండి
వెండి ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం కేజీకి రూ.1,100 పెరిగి రూ.1,08,100 (టాక్స్లతో సహా) కి చేరింది. ఆల్-టైమ్ హై లెవెల్ను మళ్లీ టచ్ చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ శుక్రవారం మార్నింగ్ సెషన్లో రూ.2,011 పెరిగి రూ.1,00,403 వద్ద రికార్డ్ హైని నమోదు చేశాయి. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి రూ.99,906 వద్ద ట్రేడ్ అయ్యాయి. జియో పొలిటికల్ టెన్షన్ల వలన గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. స్పాట్ గోల్డ్ రేటు 0.84 శాతం పెరిగి ఔన్స్ (28 గ్రాముల) కు 3,415.13 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు శుక్రవారం రూ.2,120 పెరిగి 10 గ్రాములకు రూ.1,01,400 కు చేరుకుంది. 22 క్యారెట్ల రేటు రూ.1,950 పెరిగి రూ.92,950 ని టచ్ చేసింది. సిల్వర్ రేటు కేజీకి రూ.1.10 లక్షలు ఉంది.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే ?
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్లు పెరిగాయి. దీనికి తోడు యూఎస్ ట్రేడ్ పాలసీలో అనిశ్చితి, ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెంచాయని మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ రాహుల్ కలంత్రి పేర్కొన్నారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ 90 రోజుల పాటు ఇచ్చిన టారిఫ్ పాజ్ను మరికొంతకాలం కొనసాగించొచ్చని ప్రకటించినా, ఇన్వెస్టర్ల ఆందోళనలు తగ్గడం లేదు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా బలహీనంగా ఉండడంతో ఫెడరల్ రిజర్వ్ మరిన్ని రేట్ కట్స్ చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో యూఎస్ బాండ్లలో కంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
“యూఎస్ అప్పులపై ఆందోళనలు, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు వల్ల కామెక్స్లో గోల్డ్ ఒక్క రాత్రిలో ఔన్స్కు 50 డాలర్లు పెరిగింది. బంగారానికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. గోల్డ్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు. గోల్డ్కు కామెక్స్లో 3,290 డాలర్ల వద్ద సపోర్ట్, 3,400 డాలర్ల దగ్గర రెసిస్టెన్స్ ఉందని అన్నారు. ఎంసీఎక్స్లో రూ.96,000 వద్ద సపోర్ట్ ఉందని, రూ.99,500 దగ్గర రెసిస్టెన్స్ ఉందని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్లు పెరిగి, క్రూడాయిల్ ధరలు ఎక్కువైతే గోల్డ్ రేట్లు మరింత పెరగొచ్చని అన్నారు. మరోవైపు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా యూఎస్ డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు గోల్డ్ను పెద్ద మొత్తంలో కొంటున్నాయి. బంగారం రేట్లు పెరగడానికి ఇదొక కారణం.