
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్లో ఇండియన్ షూటర్ల గోల్డ్ మెడల్స్ వేట దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆదివారం బరిలోకి దిగిన నాలుగు టీమ్స్ స్వర్ణాలతో మెరిశాయి. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబుటా, కిరణ్ అంకుష్ జాదవ్, రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్తో కూడిన ఇండియా బృందం 17–11తో కజకిస్తాన్ టీమ్పై గెలిచింది.
విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టైటిల్ ఫైట్లో మెహులీ ఘోష్, ఎలావనిల్ వెలారివన్, మేఘనా సజ్జనార్తో కూడి ఇండియా టీమ్ 16–10తో కొరియాను ఓడించి టాప్ ప్లేస్ను సాధించింది. దివ్యాన్ష్ సింగ్ పన్వర్, సాయి కార్తీక్ రవిశంకర్, విదిత్ జైన్తో కూడిన జూనియర్ టీమ్ కూడా 16–10తో కొరియా జట్టును ఓడించి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది. జూనియర్ విమెన్స్లో నాన్సీ, రమితా, తిలోత్తమ సేన్తో కూడిన టీమ్ 16–2తో కొరియాను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఇండియా పది స్వర్ణాలు సాధించింది.