
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలో 100 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ విషయాన్ని పోలీసులు శనివారం వెల్లడించారు. గోల్డ్ ప్లేటింగ్ కోసం ఆలయంలో ఉంచిన 100 గ్రాముల బంగారం చోరీ అయిందని ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. బంగారాన్ని ఎవరు దొంగిలించారో సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘‘రెండు రోజుల క్రితమే ఆలయంలో గోల్డ్ ప్లేటింగ్ వర్క్ జరిగింది. పనయ్యాక మిగతా బంగారాన్ని ఆలయ సిబ్బంది లాకర్ లో ఉంచారు. మళ్లీ గోల్డ్ ప్లేటింగ్ కోసం బంగారాన్ని బయటకు తీసి ఉంచగా చోరీకి గురైంది. వెంటనే ఆలయ సిబ్బంది మాకు ఫిర్యాదు చేశారు. చోరీపై దర్యాప్తు చేస్తున్నాం” అని ఆ అధికారి వివరించారు.