బషీర్ బాగ్, వెలుగు: ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. అయినా కేసీఆర్ పట్టుదలతో తెలంగాణ సాధించారు” అని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేస్తుంటే ఎంతో మంది కించపరిచేలా మాట్లాడారని, స్వరాష్ట్రమే లక్ష్యంగా ముందుకు వెళ్లి అనుకున్నది కేసీఆర్ సాధించారని ఆయన పేర్కొన్నారు.
కోఠిలోని హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో గడల పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేశాయని విమర్శించారు. బంగారు తెలంగాణలో భాగంగా అందరూ కేసీఆర్తో అడుగులు వేయాలన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బంగారు తెలంగాణ చివరి దశలో ఉన్నదని, దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే మరోసారి కేసీఆర్ను గెలిపించాలని కోరారు.