
- ధరణి పోర్టల్ రిఫార్మ్స్ కమిటీ సభ్యుడికి వీఆర్వోల జేఏసీ విజ్ఞప్తి
బషీర్ బాగ్ , వెలుగు: గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని రాష్ట్ర వీఆర్వోల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీశ్ అన్నారు. వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేశారని,18 ఏండ్లుగా ఎలాంటి ప్రమోషన్లు , సీనియారిటీ లేకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు. గాంధీ భవన్ లో ధరణి రిఫార్మ్స్ కమిటీ సభ్యుడు కోదండరెడ్డిని ఆదివారం వీఆర్వో జేఏసీ సభ్యులు కలిసి తమ సమస్యలను వివరించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్వో వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ధరణి కారణంగా భూ తగాదాలు ఎక్కువయ్యాయని, దానిని ప్రక్షాళన చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ నేతలు హరాలే సుధాకర్ రావు, సురేష్ బాబు, పల్లెపాటి నరేష్, ప్రతిభ, పగిళ్ల వెంకన్న, రాజమల్లు, శ్రీహరి నాయక్, రామ స్వామి, ప్రభు, బాలాజీ, మధు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.