హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో 55 రోజులు కొనసాగిన సమ్మె కాలం జీతాన్ని సంక్రాంతికి నాలుగు రోజుల ముందే ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 11న ఒకే విడతలో అందరికీ వేతనాలు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ను ఎంపిక చేశారు. 202 మంది లిస్టుతో సర్క్యులర్ జారీచేశారు. వీరంతా బోర్డులో సభ్యులుగా ఉంటారు. వీరిని సంబంధిత రీజియన్ మేనేజర్లు గుర్తించి, నామినేట్ చేశారు. డిపో, వర్క్షాప్ నుంచి ఇద్దరు చొప్పున ఇందులో ఉన్నారు. డిపోల పరిధిలో ఉద్యోగుల సమస్యలు, రిక్వెస్ట్లు వీరు స్వీకరిస్తారు. మీటింగ్స్ పెట్టుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.
అక్టోబర్ నెల అద్దె బస్సుల బిల్లులు విడుదల
ఆర్టీసీలోని అద్దె బస్సుల ఓనర్లకు ఒక నెల బిల్లు చెల్లించారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల బకాయిలు ఉండగా, అక్టోబర్వి మంగళవారం రిలీజ్ చేశారు. 3 నెలలుగా తమకు బకాయిలు రాకపోవడంతో అద్దె బస్సుల ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం లోపు చెల్లించకుంటే బస్సులను నిలిపేస్తామంటూ ఈడీకి లెటర్ రాశారు. దిగొచ్చిన యాజమాన్యం ఒక నెల బిల్లు రూ.20 కోట్లు విడుదల చేసింది. 2,103 అద్దె బస్సులు ఉండగా, ఒక్కో బస్సుకు సుమారుగా నెలకు లక్ష దాకా చెల్లిస్తున్నారు. వారంలో మిగతా బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పారని బస్సు ఓనర్లు తెలిపారు.