- అక్కడి పేషెంట్లకు ఇక్కడ్నుంచే ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్
- రోగులతో మాట్లాడేందుకు, రిపోర్ట్ల షేరింగ్కు ఏర్పాట్లు
- మరో మూడు నెలల్లో అందుబాటులోకి.. నిమ్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఈ–ఐసీయూ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా ఉట్నూర్, నాగర్ కర్నూల్, ఏటూరు నాగారం, భద్రాచలం, నిర్మల్ తదితర ప్రాంతాల్లో ఉన్న దవాఖాన్లను హైదరాబాద్లోని నిమ్స్కు లింక్ చేస్తున్నది. నిమ్స్ సీనియర్ డాక్టర్లు, మెడికల్ ప్రొఫెసర్లు ఇక్కడి నుంచే అక్కడి ఐసీయూల్లో ఉన్న పేషెంట్లతో ఆన్లైన్లో మాట్లాడి, వారి రిపోర్ట్లు పరిశీలించి ట్రీట్మెంట్కు సంబంధించి అక్కడి డాక్టర్లకు సూచనలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్రంలో 15 ప్రాంతాల్లోని హాస్పిటళ్లను నిమ్స్కు లింక్ చేయనున్నారు. ఇందుకోసం ఆయా హాస్పిటళ్లలోని ఐసీయూల్లో ప్రతి బెడ్డుకు కెమెరా, మైక్, మానిటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని, 3 నెలల్లో ఈ–-ఐసీయూ విధానం అమల్లోకి వస్తుందని హెల్త్ ఆఫీసర్ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు, క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండే రోగులకు సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అని ఆఫీసర్ అన్నారు.
ఎమర్జెన్సీ పేషెంట్ల ప్రాణాలు కాపాడొచ్చు
ఈ-–ఐసీయూ కోసం నిమ్స్ హాస్పిటల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లోని ఐసీయూల్లో ఉన్న పేషెంట్ల కండీషన్ను ఇక్కడి నుంచే మానిటర్ చేసేలా మానిటర్లు, కెమెరాలు, స్పీకర్లు బిగిస్తున్నారు. ఇక్కడి సీనియర్ డాక్టర్లు రోజూ ఉదయం, సాయంత్రం ఐసీయూల్లోని పేషెంట్ల కండీషన్ను పరిశీలించనున్నారు. రోగుల డయాగ్నస్టిక్ రిపోర్ట్లను షేర్ చేసేందుకు, హార్ట్ బీట్, బీపీ వంటివి రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. యాక్సిడెంట్లు, స్ట్రోక్స్, సూసైడ్ అటెంప్ట్స్ వంటి ఎమర్జెన్సీ కండీషన్లలో ఉన్న పేషెంట్ల ప్రాణాలను కాపాడేందుకు ఈ–ఐసీయూ విధానం ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్కు వచ్చేలోగా ‘గోల్డెన్ హవర్’ దాటిపోయి, పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి మరణాలను తగ్గించేందుకు ఈ–ఐసీయూ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఫండ్స్తో ఏర్పాటు
కరోనా టైమ్లో దేశంలో ఐసీయూ బెడ్లు సరిపోక చాలా మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కర్నాటక హెల్త్ ఆఫీసర్లు అక్కడి ప్రభుత్వ దవాఖాన్లలో ఈ–-ఐసీయూ విధానాన్ని ప్రారంభించారు. అక్కడ సక్సెస్ కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్లో ఈ కార్యక్రమాన్ని చేర్చింది. ఈ-–ఐసీయూ విధానాన్ని అమలు చేస్తే, నిధులు ఇస్తామని ప్రకటించింది. మన రాష్ట్ర సర్కార్ ఇందుకు ఓకే చెప్పడంతో, కేంద్రం ఫండ్స్ కేటాయించింది. ఇప్పటికే టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి రాగా, మరో మూడు నెలల్లో ఈ–ఐసీయూ విధానం కూడా అమల్లోకి రానుంది.