ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు)తో చాలా మంది చనిపోతున్నారు. చిన్న పిల్లలనుంచి వృద్ధులకు వరకు వయసుతో సంబంధం లేకుండా ఆకస్మికంగా కుప్పకూలిపోతున్నారు. ఆటలాడుతూ, రన్నింగ్ చేస్తూ, జిమ్ చేస్తూ.. స్నానం చేస్తూ.. ఇంకా కొందరైతే దారుణంగా కూర్చున్నవారు కూర్చిన్నట్లే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది.. యూపీలోని ఝాన్సీలో ఓ ఎల్ ఐసీ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ చనిపోయారు.
యూపీలోని ఝాన్సీలో 30ఏళ్ల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) డెవలప్ మెంట్ ఆఫీసర్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన ఘటన బుధవారం (నవంబర్5) జరిగింది. ఝాన్సీలోని సిప్రి బజార్ ప్రాంతంలోని నల్గంజ్ నివాసి రవీంద్ర అహిర్వార్ అనే వ్యక్తి క్రికెట్ఆటలో బౌలింగ్ వేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. చికిత్సకోసం అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రవీంద్ర చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
గతంలో రవీంద్రకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ ఆకస్మాత్తుగా ఇలా కుప్పకూలిపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అతడిని పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుకు గురైన సంకేతాలున్నాయని తెలిపారు. రవీంద్ర మృతికి పోస్ట్ మార్టమ్ రిపోర్టు వస్తే గానీ అసలు కారణం తెలుస్తుందని డాక్టర్లు చెప్పారు.
