న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీనియర్ నేతల కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. కాశ్మీర్ హిందూ మెజార్టీ రాష్ట్రమై ఉంటే బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేసి ఉండేదా?, ఇండియన్ మీడియా వార్తల్ని కవర్ చేయనంత మాత్రాన కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లా? అని మాజీ మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. ఆయన కామెంట్స్పై దుమారం నడుస్తుండగానే కాంగ్రెస్కే చెందిన మరో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. ‘మోడీ, షా కలిసి ఇండియాలో పాలస్తీనాను క్రియేట్ చేశారు’ అంటూ ఏకంగా ఓ వ్యాసాన్నే రాశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్ అనడానికి ఈ ఇద్దరు నేతల కామెంట్లు మరో రుజువులని, దేశ సమస్యకు మతం రంగు పులమడం దురదృష్టకరమని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు.
మోడీ మెంటర్ నెతన్యాహు
మోడీ, అమిత్ షాకు ఇజ్రాయెల్ పీఎం బెంజిమెన్ నెతన్యాహు గురువు లాంటివారని అయ్యర్ ఆక్షేపించారు. ‘‘జియోనిజం(యూదుల ప్రత్యేక దేశ ఉద్యమం) కారణంగా పాలస్తీనియన్లపై ఏడు దశాబ్దాలుగా అణచివేత కొనసాగుతూనే ఉంది. పౌరుల స్వేచ్ఛ కోరుకునే ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవాల్ని ఎలా తొక్కేయాలో ఇజ్రాయెల్ను చూసి మన నాయకులు నేర్చుకున్నారు. కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ ఎత్తేయడం ద్వారా పాలకులు ఇండియా ఉత్తర సరిహద్దులో మరో పాలస్తీనాను సృష్టించారు’’అని అయ్యర్ తన వ్యాసంలో రాశారు. మాజీ మంత్రి చిదంబరం ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కాశ్మీర్ గనుక హిందూ డామినెంట్ స్టేట్ అయ్యేదుంటే బీజేపీ ఇలా చేసేదికాదని, కండబలంతో కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని లాక్కున్నారని ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేయడంతో బిల్లులు పాసయ్యాయని చిదంబరం అన్నారు.
కాంగ్రెస్ ఇంకెంత దిగజారుతుందో..
జమ్మూకాశ్మీర్లోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకుందని, కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగే ఓ వర్గాన్ని బుజ్జగించే పనిలో పడిందని, ఆ పార్టీ నేతల కామెంట్లే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇండియాను ‘హిందూ–ముస్లిం’ కోణంలో తప్ప మరోలా చూడటం కాంగ్రెస్కు చేతకాదని, అందుకే చిదంబరంపై జాలిపడుతున్నానని బీజేపీ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ ఇంకెంత దిగజారుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు చౌహాన్ సెటైర్ వేశారు. ‘‘కాంగ్రెస్ లీడర్లది డర్టీ మైండ్. ఇలాంటి కామెంట్లతో వాళ్లకు పాకిస్తాన్తో కనెక్షన్ ఉందనడానికి నిరూపించుకుంటున్నారు. కాశ్మీర్ లాంటి సున్నితమైన సమస్యకు మతం రంగు పులిమినందుకు సిగ్గుపడాలి’’అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మండిపడ్డారు. కాంగ్రెస్ లీడర్లవి బాధ్యతారహిత కామెంట్లని, రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు.