ఏసీబీ కి చిక్కిన గవర్నమెంట్ డాక్టర్

 ఏసీబీ కి చిక్కిన గవర్నమెంట్ డాక్టర్

కంప్యూటర్ ఆపరేటర్‌కు‌ వేతనం చెల్లించేందుకు అతని నుంచి లంచం తీసుకుంటూ ఓ గవర్నమెంట్​డాక్టర్​ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌ పట్టణంలో జరిగింది. ఏసీబీ డీఎస్పీ రవీందర్‌‌ వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు పీహెచ్‌‌సీలో వడ్డెపల్లి శ్రీనాథ్‌‌ డాక్టరుగా పని చేస్తున్నారు. పీహెచ్‌‌సీలో కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్న జోసఫ్‌‌ ప్రశాంత్‌‌ ఐదు నెలలపాటు కొండపాక మండలంలో డిప్యుటేషన్‌‌ పై పని చేసి లద్నూరు పీహెచ్‌సీకి వచ్చాడు. అతనికి సంబంధించిన ఐదు నెలల వేతన బిల్లులను పాస్‌‌ చేయాలంటే రూ. యాభై వేలు ఇవ్వాలని శ్రీనాథ్‌‌ డిమాండ్‌‌ చేశాడు. దీంతో విసిగి వేసారిన జోసఫ్‌‌ ప్రశాంత్‌‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం హుస్నాబాద్‌‌లో ని ఒక ప్రైవేటు హాస్పిటల్​లో డాక్టర్​ వడ్డెపల్లి శ్రీనాథ్‌‌కు  జోసఫ్‌‌ ప్రశాంత్‌‌  రూ. 45 వేలు అందిస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి పట్టుకున్నారు. శ్రీనాథ్‌‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రవీందర్‌‌ తెలిపారు.