
- 2017లో అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు.. ఇప్పటికీ అమలైతలే
- చట్టంలో టెస్టుల చార్జీలు, ఐపీ ఫీజును నియంత్రించే క్లాజులు
- కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడితో సర్కారు వెనక్కి తగ్గుతున్నట్లు ఆరోపణలు
- దేశంలో 17 రాష్ట్రాల్లో అమలవుతున్న యాక్ట్
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లను నియంత్రించే పవర్ ఉన్న క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్(సీఈ) యాక్ట్ను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ తటపటాయిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్టు 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2002 నాటి అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన బిల్లుకు అసెంబ్లీ, మండలి కూడా ఆమోదం తెలిపాయి. చట్టం అమలుకు గైడ్లైన్స్ రూపొందించేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, హెల్త్ డైరెక్టర్, ఇతర నిపుణులతో కూడిన ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల, ల్యాబుల యాజమాన్యాలు, డాక్టర్లు, ఇతర స్టేక్ హోల్డర్స్తో అనేకసార్లు సంప్రదింపులు, చర్చలు జరిపి 2020 జనవరిలో డ్రాఫ్ట్ రూల్స్ను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ రూల్స్కు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపడం లేదు. కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాల నుంచి ఉన్న ఒత్తిడి వల్లే చట్టం అమలుకు వెనకడుగు వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆరేండ్లుగా సాగదీత?
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ –2002’ పేరిట చట్టాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ వచ్చాక ఇదే చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. ఈ చట్టంలో ప్రైవేట్ హాస్పిటళ్ల నియంత్రణ విషయంలో ప్రభుత్వానికి చాలా తక్కువ పవర్స్ ఉన్నాయి. ఇటీవల హెల్త్ మినిస్టర్ హరీశ్రావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2010లో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్’ యాక్ట్ను తీసుకొచ్చింది. హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్, టెస్టుల ఫీజులు, బెడ్ చార్జీల వరకూ ప్రతిదాన్ని నిర్ణయించేలా, నియంత్రించేలా అధికారాలను హెల్త్ డిపార్ట్మెంట్లకు ఉండేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని అమలు చేయడం లేదా రాష్ట్రాల్లో ఇదివరకే ఉన్న చట్టాలను కొనసాగించుకోవడం అనే ఆప్షన్ను రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలేసింది. అయితే మెజారిటీ రాష్ట్రాలు ఈ చట్టం అమలుకే మొగ్గు చూపాయి. మన సర్కార్ కూడా 2017లో ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంది. అసెంబ్లీ, మండలిలో ఇందుకు సంబంధించిన తంతు పూర్తవగానే, కార్పొరేట్ యాజమాన్యాలు తమ వ్యతిరేకతను ప్రకటించాయి. దీంతో ఇప్పటికీ చట్టం అమల్లోకి రావడం లేదు. ఫోరం అగైనస్ట్ కరప్షన్ ప్రెసిడెంట్ విజయ్ గోపాల్ ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోర్టు మొట్టికాయలతో నాలుగు వారాల్లోగా చట్టం అమలుకు సంబంధించిన గైడ్లైన్స్ రూపొందిస్తామని రాష్ట్ర సర్కార్ కోర్టుకు తెలిపింది. కానీ, ఎలాంటి కదలిక లేదు.
యాక్ట్తో ఇదీ లాభం..
ఒక్కసారి సీఈ చట్టం అమల్లోకి వస్తే కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది. ఓపీ కన్సల్టేషన్, టెస్టుల చార్జీలు, బెడ్ చార్జీల వంటివన్నీ హాస్పిటల్ స్థాయిని బట్టి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ చార్జీల కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కౌన్సిళ్లు పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక నిబంధనలు ఉండటంతో ఈ చట్టాన్ని కార్పొరేట్ శక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యవస్థకు, ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో 17 రాష్ట్రాలు సీఈ యాక్ట్ను అడాప్ట్ చేసుకున్నాయి.