
లక్షల్లో జీతం ఉన్నా ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడటం ఆపడం లేదు.. ఏసీబీ, ఐటీ, విజిలెన్స్.. ఇలా డిపార్ట్మెంట్ ఏదైనా.. అవినీతి సొమ్ముతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ( మే 30 ) ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ప్రభుత్వ ఇంజనీర్ ఇంట్లో భారీగా అవినీతి సొమ్ము పట్టుబడింది.. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
భువనేశ్వర్లోని గ్రామీణ పనుల విభాగం చీఫ్ ఇంజనీర్ బైకుంఠ నాథ్ సారంగికి సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. సోదాలు జరుగుతున్న సమయంలో బైకుంఠనాథ్ ఇంటి కిటికీలో నుంచి డబ్బు పడేసినట్లు తెలుస్తోంది.
ఈ సోదాల్లో రూ.2.1 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.సోదాల సమయంలో, బైకుంఠనాథ్ తన ఇంటి కిటికీలోంచి రూ.500 నోట్ల కట్టలను విసిరి పారవేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు అధికారులు.
#WATCH | Bhubaneswar: Odisha Vigilance Department conducted searches at 7 locations of Odisha Rural Works Division Chief Engineer, Baikuntha Nath Sarangi
— ANI (@ANI) May 30, 2025
About Rs 1 crore has been recovered from his flat in Bhubaneswar, while about Rs 1.1 crore has been recovered from his… pic.twitter.com/n8MQxYfU0L
భువనేశ్వర్, అంగుల్, పిపిలి (పూరి) లోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు జరిపారు అధికారులు. భువనేశ్వర్ లోని దుండుమాలోని ఒక ఫ్లాట్ నుండి సుమారు రూ.1 కోటి, అంగుల్ జిల్లా కరడగాడియాలోని బైకుంఠనాథ్ కి చెందిన రెండంతస్తుల ఇంట్లో సుమారు రూ.1.1 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
స్వాధీనం చేసుకున్న నగదు సుమారు రూ.2.1 కోట్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు. దాడులు కొనసాగుతున్నాయని, బైకుంఠనాథ్ ఆస్తులను వివరంగా అంచనా వేస్తున్నామని తెలిపారు విజిలెన్స్ అధికారులు.