న్యూఢిల్లీ: ఆఫ్రికన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. నైజీరియా, ఇథియోపియా, ఘనా వంటి సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాలకు, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెంచేందుకు నాన్ టారిఫ్ బారియర్ల (ఎన్టీబీ)లను తొలగించడంపై పనిచేస్తోంది. నాన్ టారిఫ్ బారియర్లు అంటే టారిఫ్లు వేయడానికి బదులు ఇతర మార్గాల్లో రిస్ట్రిక్షన్లు పెట్టడం. అంటే అంక్షలు వంటివి విధించడం. సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాలకు, ఇండియాకు మధ్య బైలేటరల్ ట్రేడ్ మెరుగుపరిచేందుకు మీటింగ్స్ జరుగుతున్నాయని సంబంధిత అధికారి ఒకరు అన్నారు. ఈ రీజియన్లో ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి సౌత్ ఆఫ్రికా. 2022–23 లో ఇరు దేశాల మధ్య మొత్తం 18.9 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరిగింది.
ఇందులో మన ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లు. నైజీరియాకు చేస్తున్న ఎగుమతుల విలువ 5.16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియా – నైజీరియా మధ్య 11.85 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. టొగో (మొత్తం ట్రేడ్ విలువ 6.6 బిలియన్ డాలర్లు, ఎక్స్పోర్ట్స్ 6 బిలియన్ డాలర్లు), టాంజానియా (6.5 బిలియన్ డాలర్లు, ఎగుమతులు 3.93 బిలియన్ డాలర్లు) కూడా ఇండియాకు మంచి వ్యాపార భాగస్వాములుగా ఉన్నాయి. మొజాంబిక్ (5 బిలియన్ డాలర్లు, ఎగుమతులు 2.5 బిలియన్ డాలర్లు), అంగోలా (4.22 బిలియన్ డాలర్లు, ఎక్స్పోర్ట్స్ 621 మిలియన్ డాలర్లు), కెన్యా (3.4 బిలియన్ డాలర్లు, ఎగుమతులు 3.2 బిలియన్ డాలర్లు) వంటి దేశాలతో కూడా ఇండియాకు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
ఎన్టీబీలు తొలగిస్తే ట్రిలియన్ డాలర్లకు..
ఎక్స్పోర్ట్స్ పెంచేందుకు ఫుడ్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వంటి సెక్టార్లపై ఫోకస్ పెట్టాలని ఎగుమతిదారులను కామర్స్ మినిస్ట్రీ కోరింది. గ్లోబల్ లెవెల్లో ఫెయిర్స్, ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సలహా ఇచ్చింది. దేశ మర్చండైజ్ (గూడ్స్) ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్లో 33.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకు ముందు ఏడాది అక్టోబర్తో పోలిస్తే 6.21 శాతం ఎక్కువ. ఇంపోర్ట్స్ 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు ట్రేడ్ డెఫిసిట్ కూడా 31.46 బిలియన్ డాలర్లను టచ్ చేసింది. అదే ఈ ఏడాది ఏప్రిల్– అక్టోబర్ మధ్య మొత్తం ఎగుమతులు 244.89 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 391.96 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.
ఈ ఏడు నెలల్లో ట్రేడ్ డెఫిసిట్ 147.07 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కిందటేడాది ఇదే టైమ్లో ఈ నెంబర్ 167.14 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా. నాన్ టారిఫ్ బారియర్లు (ఎన్టీబీ) వేగంగా తొలగించాలని, అప్పుడే దేశ ఎగుమతులు పెరుగుతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఈ ఏడాది ఆగస్ట్లో రిపోర్ట్ విడుదల చేసింది. ఎన్టీబీలను తొలగిస్తే 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎగుమతులకు చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. ఉదాహరణకు సెరమిక్ టైల్స్కు ఈజిప్ట్లో, మైక్రోబయోలాజికల్ రిజెంట్స్కు సౌదీ అరేబియాలో ఎక్కువ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అక్కడి రూల్స్ కఠినంగా ఉండడం లేదా ఇతర కారణాలతో ఈ అడ్డంకులు నెలకొన్నాయి.
జీసీసీతోనే ఎక్కువ..
‘సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్లోని కొన్ని దేశాలతో జరుగుతున్న బైలేటరల్ ట్రేడ్స్కు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్లో ఓ వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ దేశాలతో ఇండియాకు ఉన్న ఎకనామిక్, కమర్షియల్ రిలేషన్స్పై రివ్యూ జరిగింది. ఎగుమతులు పెంచడం, నాన్ టారిఫ్ బారియర్లు తొలగించడంపై చర్చించారు’ అని సంబంధిత అధికారి వెల్లడించారు. ఎన్టీబీలు తొలగిస్తే బైలేటరల్ ట్రేడ్స్ మరింత మెరుగవుతాయని, ఈ దేశాలకు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు.
ఇలాంటి సమావేశమే గల్ఫ్ దేశాల (జీసీసీ) తో కూడా జరిగిందని అన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్, బహ్రయిన్ దేశాలను గల్ఫ్ కంట్రీస్గా పిలుస్తున్నారు. ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా జీసీసీ ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియా– సౌదీ అరేబియా మధ్య 52.76 బిలియన్ డాలర్లు, యూఏఈతో 84.8 బిలియన్ డాలర్లు, ఖతర్తో 18.77 బిలియన్ డాలర్లు, కువైట్తో 13.8 బిలియన్ డాలర్లు, ఒమన్తో 12.4 బిలియన్ డాలర్ల విలువైన ట్రేడ్ జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.