Water War: భారత్ మా రిక్వెస్ట్స్ పట్టించుకోవట్లేదు.. యుద్ధమే మాకున్న ఏకైక ఆప్షన్: బిలావల్ భుట్టో

Water War: భారత్ మా రిక్వెస్ట్స్ పట్టించుకోవట్లేదు.. యుద్ధమే మాకున్న ఏకైక ఆప్షన్: బిలావల్ భుట్టో

గత నెలలో జరిగిన ఇండియా-పాక్ కాల్పుల నుంచి దాయాది దేశం భారీగా నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ యుద్ధం అంటూ గొంతుక ఎత్తుతోంది. అసలు యుద్ధం జరిగితే వారం రోజులు కూడా నిలబడలేని స్థితిలో ఆర్థికంగా, ఆయుధ సంపత్తిలోనూ దయనీయంగా ఉన్న పాక్ తన మిత్రులైన చైనా, టర్కీల అండ చూసుకుని రంకెలు వేస్తోంది. 

పెహల్గామ్ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవటంతో మోదీ సర్కార్ ఏకంగా సిందు జలాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ నీరు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు అక్కడి తాగు సాగు నీటి అవసరాలకు చాలా కీలకమైనది. ఎన్నిసార్లు ఉగ్రవాదం వీడాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని భారత్ చెప్పినా పాక్ వినకపోవటంతో ఈసారి భారత్ సరైన బుద్ది చెప్పేందుకు నీటిని ఆపేసింది. గడచిన కొన్ని వారాలుగా పాక్ నీటిపై చర్చలు జరిపేందుకు పలు లేఖలు రాసినప్పటికీ దిల్లీ పెద్దలు దానిని పక్కనపెడుతున్నారు. ముందు బుద్ది మారాలని భారత్ ఈ చర్యలతో గట్టిగానే చెబుతోంది.

అయితే సింధు జలాల నిలిపివేతపై తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో మాట్లాడారు. రెండు దేశాలపై మధ్య ఉన్న అన్ని సమస్యలను మాటలతో పరిష్కరించుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. దీనికి ముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇలాంటి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ నీటిని ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడితే ఇండియాపై యుద్ధం చేయాల్సి ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తమకు నీటిని రాకుండా చేసేందుకు భారత్ చేసే ప్రయత్నాలను తమ అస్థిత్వానికి ముప్పుగా పరిగణించాల్సి ఉంటుందని అది యుద్ధానికి దారితీస్తుందని అన్నారు. 

ALSO READ | ఇజ్రాయెల్‎పై పాకిస్థాన్ అణ్వస్త్ర దాడి..? సంచలన విషయం బయటపెట్టిన ఇరాన్ కీలక అధికారి

తాము యుద్ధాన్ని కోరుకోవటం లేదని అయితే తమ దేశ భద్రత, నీటిపై హక్కుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలేదని ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై ఎన్నిసార్లు తాము సంప్రదింపులకు ప్రయత్నించినా భారత్ మాత్రం చర్చలకు రావటం లేదని, ఇది వారికే ప్రమాదాన్ని కలిగించే వైఖరని అన్నారు. అంతర్జాతీయంగా కూడా ఈ అంశంపై తాము పోరాడుతున్నామన్నారు. తాము ఉగ్రవాదం, కశ్మీర్ అంశంతో పాటు నీటి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమెరికాను ఈ విషయంలో మధ్యవర్థిత్వానికి రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. 

అయితే ఇప్పటికే భారత ప్రధాని మోదీ మాత్రం చాలా స్పష్టంగా పాకిస్థాన్ తో మాటలంటూ ఉంటే అది ఉగ్రవాదం, పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ పైనే ఉంటుందని తేల్చి చెప్పేశారు. రక్తం, నీరు కలిసి పారటం కుదరదని.. నీటి విషయంలో తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. పాక్ తన భూభాగంపై పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలపై, ఉగ్ర సమూహాల గురించి బలమైన చర్యలు తీసుకునే వరకు నీటి అంశంపై మాటలుండవని భారత ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. ఇకపై పాక్ నుంచి జరిగే ఎలాంటి ఉగ్రదాడులపైనా యుద్ధంగా పరిగణిస్తామని చెప్పిన మోదీ ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ ముగియలేదని సుస్పష్టం చేశారు.