
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వరుసగా మూడు రోజుల నుంచి ఇరుదేశాల పరస్పరం బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇజ్రాయెల్కు అమెరికా, ఇరాన్కు ఇతర ముస్లిం దేశాలు మద్దతు ఇస్తుండటంతో తాజా యుద్ధం వరల్డ్ వార్ 3కి దారి తీసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు యుద్ధ నిపుణులు. ఈ తరుణంలో ఐఆర్జీసీ టాప్ కమాండర్, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మొహ్సేన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ టెలివిజన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్పై ఇజ్రాయెల్ అణు బాంబును ప్రయోగిస్తే, పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్పై తిరిగి అణు బాంబుతో దాడి చేస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని జనరల్ మొహ్సేన్ రెజాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనరల్ మొహ్సేన్ రెజాయ్ వ్యాఖ్యలు ప్రపంచదేశాలను షాక్కు గురి చేయడంతో పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమైంది. జనరల్ మొహ్సేన్ రెజాయ్ వ్యాఖ్యలను ఇస్లామాబాద్ ఖండించింది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెజాయ్ మొహ్సేన్ రెజాయ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఇజ్రాయెల్పై అణు ప్రతీకారం తీర్చుకుంటామని మేం ఇరాన్కు హామీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రికి మూడవ పక్ష వివాదంతో సంబంధం లేదని ఆయన పునరుద్ఘాటించారు. అణు సాయం నిరాకరించిన పాక్.. ఇరాన్కు స్పష్టమైన బహిరంగ మద్దతును ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్కు మద్దుతగా నిలుస్తామని పాక్ పేర్కొంది.
ఈ మేరకు 2025, జూన్ 14న జాతీయ పాక్ జాతీయ అసెంబ్లీలో మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దురాక్రమణను ముస్లిం దేశాలు ఐక్యంగా ఎదుర్కొకపోతే.. ఇరాన్కు పట్టిన గతే రేపు మిగిలిన ముస్లిం దేశాలకు పడుతోందన్నారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనా వంటి ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందన్నారు.
ఇజ్రాయెల్ ను ముస్లిం దేశాలు కలిసికట్టుగా ఎదుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు కొనసాగించే ముస్లిం దేశాలు ఆ సంబంధాలను వెంటనే తెంచుకోవాలని ఆయన కోరారు. ముస్లిం దేశాల మధ్య దాడులపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.