
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీల బలోపేతం కోసం ఈ నెల 10 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేండ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో వారం రోజుల పాటు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 10న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో పేరెంట్స్ సెల్ఫీ దిగటం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించడం, ఈ నెల 11న మూడేండ్లు పైబడిన చిన్నారులను గుర్తించి వారి నివాసాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కలిపించి పిల్లలను చేర్చేలా ప్రోత్సహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పోషకాహార వివరాలను హైలెట్ చేయడం, చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, జూన్ 17న అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం చేయాలన్నారు. స్వచ్ఛ అంగన్వాడీ ప్రోగ్రాం కింద పారిశుధ్య నిర్వహణ, చైల్డ్ ఫ్రెండ్లీగా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో మేదో మదనం సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజేంద్రనగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ క్యాంపస్ లో జరగనున్న ఈ సదస్సులో అంగన్వాడీ, స్కీములు, మహిళా శిశు సంక్షేమ పథకాలు, నూతన విధానాలపై చర్చించనున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, దివ్యాంగుల సంక్షేమంపై చర్చించనున్న ఈ సదస్సును మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.