
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. 87కోట్లతో న్యూ బిల్డింగ్స్, డెవలప్మెంట్ వర్క్స్
- ఇప్పటికే ఇల్లెందు, అశ్వారావుపేటలో పనులు ప్రారంభం..
- త్వరలో ఏజెన్సీ ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సేవలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లకు ఇక మంచిరోజులు రానున్నాయి. సంవత్సరంలోపు సకల సౌలత్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేట, చర్ల, బూర్గంపహాడ్ గవర్నమెంట్ హాస్పిటళ్లకు రూ. 87కోట్లతో కొత్త బిల్డింగ్స్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇల్లెందు, అశ్వారావుపేటలో పనులు ప్రారంభమయ్యాయి.
ఎక్కడెక్కడ ఎలా..?
ఇల్లెందులోని గవర్నమెంట్ హాస్పిటల్ను డెవలప్ చేయడంలో భాగంగా 30 పడకల హాస్పిటల్ను వంద పడకల హాస్పిటల్గా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఐదు దశాబ్దాల కిందడి ఈ ఆస్పత్రికి రిపేర్లు చేస్తూ వచ్చారు. వంద పడకల హాస్పిటల్గా మారడంతో కొత్త బిల్డింగ్ కోసం పట్టణంలోని జేకే కాలనీలో ల్యాండ్ను చూశారు. కొత్త బిల్డింగ్ నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 37.5కోట్లను మంజూరు చేసింది. బిల్డింగ్ పనులు మొదలయ్యాయి.
ఇక 30 పడకల అశ్వారావుపేట హాస్పిటల్ను ప్రభుత్వం వంద పడకల హాస్పిటల్గా మార్చింది. ఈ హాస్పిటల్ ఆవరణలో రూ. 37.5కోట్లతో కొత్త బిల్డింగ్కు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఇటీవలే పనులు మొదలయ్యాయి.
చత్తీస్గఢ్సరిహద్దు ప్రాంతంతో పాటు మారుమూల ఏజెన్సీలోని చర్ల పీహెచ్సీ ఇటీవల 30 పడకల హాస్పిటల్గా అప్ గ్రేడ్ అయింది. ఆస్పత్రి బిల్డింగ్ కోసం ప్రభుత్వం రూ. 10కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ ఫైనల్ దశలో ఉంది. టెండర్ ఫైనల్ రాగానే పనులు ప్రారంభం కానున్నాయి.
శిథిలావస్థలో ఉన్న బూర్గంపహాడ్ హాస్పిటల్కు డీఎంఎఫ్టీ కింద అధికారులు రూ. 2కోట్లు కేటాయించారు. కానీ ఈ హాస్పిటల్కు మరో రూ. 8 కోట్లకు పైగా నిధులు అవసరం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కార్పొరేషన్ బిల్డింగ్ పనులను పర్యవేక్షించనుంది. ఈ పనులన్నీ సంవత్సరంలోపు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం..
ఇల్లెందు, అశ్వారావుపేట ప్రాంతాల్లో వంద పడకల హాస్పిటళ్లతో పాటు చర్లలోని 30 పడకల హాస్పిటళ్ల బిల్డింగ్స్ పూర్తి అయితే ఏజెన్సీ వాసులకు నాణ్యమైన వైద్య సేవలందనున్నాయి. ఏజెన్సీ మండలాలైన ఆళ్లపల్లి, గుండాల, చర్ల మండలాలతో పాటు దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలకు చెందిన గిరిజనులకు మేలు కలుగనుంది.
ఎమ్మెల్యేలు, కలెక్టర్చొరవతోనే..
జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రత్యేక చొరవతోనే హాస్పిటల్స్ అప్ గ్రేడ్ కావడంతో పాటు నిధులు మంజూరు అయ్యాయి. ఇల్లెందు, అశ్వారావుపేట పట్టణాల్లో న్యూ బిల్డింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ బిల్డింగ్స్ పూర్తి అయితే ఇల్లెందు, చర్ల, అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతాల్లోని మారు మూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. - డాక్టర్ రవిబాబు, డీసీహెచ్ఎస్, భద్రాద్రికొత్తగూడెం