- గో ఎలక్ట్రిక్ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి
- ఎలక్ట్రిక్ బండ్ల వినియోగానికి ప్రభుత్వ ప్రోత్సాహం
బంజారాహిల్స్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు కరెంట్ బండ్లు ఉపయోగపడుతాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని చెప్పారు. శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్ షో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ఎలక్ట్రిక్ బైక్, ఆటో, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ రెడ్కో ఇప్పటికే 130 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిందని, హైవేలు, ప్రధాన రహదారుల్లో మరో 600 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు ట్యాక్స్లలో తగ్గింపు ఇస్తూ, వాహనాల ఉత్పత్తి సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.