న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఏయే ఆఫీసులు, కంపెనీలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుందన్న వివరాలను వెల్లడించింది. వాటిల్లో కూడా వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని, మిగతా వారిని వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఈ రూల్స్ను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర గైడ్లైన్స్ లోని వివరాలు.
- దేశవ్యాప్తంగా అత్యవసరం కాని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలను మూసేయాలి. కేవలం రక్షణ, పోలీసు, ట్రెజరీ, విద్యుత్, పెట్రోలియం, ఎల్పీజీ కంపెనీలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోస్టాఫీసులు, ఎర్లీ వార్నింగ్ ఏజెన్సీలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ అన్ని ప్రభుత్వ సంస్థలను మూసేయాలి. పోలీసులు, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, వాటర్, శానిటేషన్ డిపార్ట్మెంట్లు, మున్సిపాలిటీల్లో శానిటేషన్, వాటర్ సప్లై ఉద్యోగులు మాత్రం పనిచేయాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలోని హాస్పిటళ్లు, మెడికల్ హాల్స్, అంబులెన్సులు, ఇతర మెడికల్ఉత్పత్తుల సంస్థలు, ఈ విభాగాలకు సంబంధించిన రవాణా, ఉద్యోగులకు అనుమతి ఉంటుంది.
- అత్యవసర సర్వీసులు కాని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలను మూసివేయాలి. కూరగాయలు, గ్రోసరీస్, పాలు వంటి ఆహార సంబంధిత నిత్యావసరాల షాపులు, సంస్థలు, కోల్డ్ స్టోరేజీలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు పనిచేయవచ్చు. అయితే వీలైనంత వరకు హోం డెలివరీకి ప్రయత్నించాలి. ఇక బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఆఫీసులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికం, ఇంటర్నెట్, కేబుల్, ఐటీ సంబంధిత సర్వీసులకు అనుమతి ఉంటుంది.
- నిత్యావసరాల ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను మాత్రమే తెరిచి ఉంచాలి.
- నిత్యావసరాల రవాణా తప్ప మిగతా అన్ని రకాల రోడ్డు, రైలు, విమాన రవాణాను నిలిపివేయాలి.
- అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లూ మూసేయాలి.
- గుడులు, మసీదులు, ఇతర అన్ని రకాల ప్రార్థనా మందిరాల్లోకి పబ్లిక్ ను అనుమతించవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలేవీ చేపట్టవద్దు.
- ఎక్కువ మంది గుమిగూడే అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రం కేవలం 20 మంది వరకే అనుమతి ఉంటుంది.
- ఫిబ్రవరి 15 తర్వాత విదేశాల నుంచి వచ్చినవాళ్లు హెల్త్ అధికారులు సూచించినంత కాలం కచ్చితంగా హోం క్వారంటైన్లో ఉండాలి. లేకుంటే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు పెడతారు.
- లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు, సంస్థలలో కచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.
- ఈ గైడ్ లైన్స్ అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
లాక్డౌన్ తో ఏముంటయి, ఏవి బంద్?
- దేశవ్యాప్తంగా అన్నిచోట్లా లాక్డౌన్కు ప్రధాని మోడీ ఆదేశం
- బుధవారం నుంచి 21 రోజుల పాటు అమలు
- అత్యవసర, నిత్యవసర వస్తువులు, సేవలకు మాత్రమే మినహాయింపు
- మిగతా అన్ని రకాల ఆఫీసులు, దుకాణాలు బంద్
- జనం గుమిగూడే అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం