
కరోనా బారిన పడి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. అయితే తాజాగా పంజాబ్లోని షహీద్ భగత్సింగ్ నగర్ జిల్లా నవన్షహర్ పరిధిలోని సలో గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కరోనా కల్లోలం సృష్టించింది. పాఠశాలలో ఉన్న 350 మంది విద్యార్థుల్లో 110 మంది విద్యార్థుల నమూనాలు పరీక్షించగా.. వారిలో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేసింది. ఈ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి జగ్జీత్ సింగ్ తెలిపారు. అయితే పాఠశాలలో కరోనా ఎలా సోకిందో ఇంకా తెలియలేదు. దీనిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ పాఠశాలలో కరోనా రావడంతో విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పక్కాగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.