
- ఆ బడుల్లోని టీచర్లు , స్టూడెంట్స్ వేరే స్కూ ళ్లలో అడ్జెస్ట్మెంట్స్
- ఈ నెల 17లోగా సర్దుబాటు పూర్తికి విద్యా శాఖ చర్యలు
- కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అడ్జెస్ట్మెంట్ ఆర్డర్ల జారీ
స్టూడెంట్లు తక్కువగా ఉన్నారనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొత్తగా టీచర్ల నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో వారు బడుల్లో చేరేలోపే ఈ సర్దుబాటు పూర్తి చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో డీఈఓలు, ఎంఈఓలు అడ్జెస్ట్మెంట్ పేరుతో ఆర్డర్స్ జారీ చేస్తున్నారు.
అనధికారికంగా ఆదేశాలు
2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులు తక్కువగా ఉన్న బడులను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా నిర్ణయించింది. పదిమంది లోపు పిల్లలున్న ప్రైమరీ, 20 మంది లోపు ఉన్న అప్పర్ ప్రైమరీ, 30 మందిలోపు పిల్లలున్న హైస్కూళ్లలోని స్టూడెంట్లను దగ్గరలోని స్కూళ్లలోనూ, టీచర్లను అవసరం మేరకు ఇతర బడుల్లో అడ్జెస్ట్మెంట్ చేయాలని విద్యా శాఖ పెద్దాఫీసర్లు డీఈఓలను ఆదేశించినట్టు సమాచారం. దీనికి అనుగుణంగా అన్ని మండలాల్లో టీచర్లు, స్టూడెంట్స్ సర్దుబాటు చేసేందుకు ప్రతిపాదనలు డీఈఓలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ aలెక్కన మూత పడే సుమారు 4 వేల స్కూళ్లలోని 8 వేల మంది టీచర్లకు పైగా ఇతర బడుల్లోకి వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో పంపిస్తున్నట్టు సమాచారం. మూడు రోజుల క్రితం కరీంనగర్ డీఈఓ అధికారికంగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్జీటీ, ఎస్ఏ, ఎల్పీ, పీడీ ఇలా అన్ని విభాగాలకు చెందిన 114 మంది టీచర్లను ఇతర బడుల్లోకి చేరాలని ఆదేశించారు. కలెక్టర్ అనుమతితోనే ఈ బదిలీలు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్ ఎంఈఓ కూడా ఇలాంటి ఉత్తర్వులిచ్చారు. ఆ మండలంలోని విద్యార్థులు తక్కువున్న స్కూళ్లలోని 33 మంది టీచర్లను వేరే బడుల్లోకి రీలొకేట్ చేశారు. ఇలా చాలా మండలాల్లో టీచర్లను రిలొకేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
టీచర్లు, స్టూడెంట్ల సర్దుబాటు
తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న బడులను పేరెంట్స్ను ఒప్పించి మూసేయాలని, అలాంటి స్టూడెంట్స్కు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని గత నెలలో డీఈఓలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి సూచించారు. జూన్29నే జరిగిన రివ్యూ మీటింగ్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్కుమార్ కూడా ఈ మేరకు డీఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో డీఈఓలు అన్ని మండలాల నుంచి టీచర్స్ వర్క్ అడ్జెస్ట్మెంట్స్, స్టూడెంట్స్ స్కూల్ అడ్జెస్ట్మెంట్ ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. బడుల మూసివేతపై టీచర్స్, స్టూడెంట్స్ యూనియన్ల ఆందోళనల నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పెద్దాఫీసర్లు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో గప్చుప్ గా బడుల మూతతోపాటు టీచర్లు, స్టూడెంట్స్ సర్దుబాటు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 17లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.