- కండీషన్ సీరియస్
- ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయం
నర్సాపూర్(శివ్వంపేట)/ సికింద్రాబాద్, వెలుగు: ఓ ప్రభుత్వ టీచర్ రైలు కింద పడి సూసైడ్ చేసుకోగా, ఆ విషయం తెలిసి అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం ఆకులపేటకు చెందిన ఇజ్జడ రామారావు (43).. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల కొత్త కాలనీ స్కూల్ లో ఎస్జీటీగా పని చేస్తున్నాడు. ఆయన గత 12 ఏండ్లుగా ఫ్యామిలీతో నర్సాపూర్ పట్టణంలో ఉంటున్నాడు. శనివారం స్కూల్ కు సెలవు కాగా, బయట పని ఉందని వెళ్లిన రామారావు.. రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆయన సికింద్రాబాద్లోని బోయిగూడ సాయిబాబా టెంపుల్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్టు ఆదివారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. బాడీ ముక్కలు ముక్కలైందని చెప్పారు. డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రామారావు జేబులో సూసైడ్ నోట్ దొరికిందని చెప్పారు. ‘‘అమ్మానాన్న నన్ను క్షమించండి. అక్కాబావా నా పిల్లలు జాగ్రత్త. రూ.లక్ష అప్పు ఉంది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా’’ అంటూ అందులో పేర్కొన్నాడని తెలిపారు. కాగా, తోటి టీచర్లు నర్సాపూర్ వెళ్లి రామారావు చనిపోయిన విషయాన్ని ఆయన భార్య చిన్న అమ్ములుకు చెప్పారు. విషయం విన్న వెంటనే ఆమె బిల్డింగ్ రెండో అంతస్తు పైకెక్కి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. బలమైన గాయాలు కావడంతో ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంది. రామారావు సూసైడ్ కు కారణాలేమిటనేది తెలియలేదు. తండ్రి మరణించడం, తల్లి చావుబతుకుల మధ్య ఉండడంతో ఏడాది వయసున్న వారి కూతురు, ఐదేళ్ల కొడుకు పరిస్థితి దయనీయంగా మారింది.