తొలిసారి ఓ ఆల్కహాలిక్ డ్రింక్ను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్ప పూలతో తయారు చేసే ఈ మందును వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. 750 ఎంఎల్ బాటిల్ను రూ. 700లకు అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. 6 రకాల పండ్ల రుచుల్లో అందించబోతోంది. ఈ కొత్త డ్రింక్కు ‘మహువా న్యూట్రీ బీవరేజ్’ అని పేరు పెట్టింది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, ఆల్కహాల్ స్థాయి 5 శాతం వరకు ఉంటుందని చెబుతోంది. ఈ కొత్త మందు ఫార్ములాను ట్రైఫెడ్, ఐఐటీ ఢిల్లీ కలిసి తయారు చేశాయి. ఈ ఫార్ములాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి రావాల్సి ఉందని, రాగానే ఢిల్లీలోని 5 ట్రైబ్స్ ఇండియా ఔట్లెట్లలో అమ్మకానికి పెడతామని ట్రైఫెడ్ ఎండీ ప్రవీర్ కృష్ణ చెప్పారు. దేశవ్యాప్తంగానూ అమ్మాలనే ప్లాన్ ఉందని, దీని కోసం ప్రతి రాష్ట్రం కూడా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
వన్ ధన్ వికాస్ కార్యక్రమంతో..
మందు తయారీకి సంబంధించిన టెక్నాలజీని ఆంట్రప్రెన్యూర్స్కు అందించేందుకు నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్డీసీ)తో ట్రైఫెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. మందు తయారీ, మార్కెటింగ్కు సంబంధించి ఎన్ఆర్డీసీతో 2020 మార్చి 6న రాయ్ఘర్కు చెందిన ‘ఆదివాసీ బహుదేశీయ కో ఆపరేటివ్ సొసైటీ’ ఒప్పందం చేసుకుంది. ట్రైబల్ ఎఫైర్స్ మినిస్ట్రీకి చెందిన వాల్యూ ఎడిషన్ స్కీమ్ (వన్ ధన్ వికాస్ కార్యక్రమం) ద్వారా ఈ మందు మార్కెటింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్స్ తమ ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలో, ఎలా ప్యాక్ చేసి అమ్మాలో ఈ కార్యక్రమం కింద ట్రైనింగ్ ఇస్తారు. ఈ పథకానికి కేంద్రం రూ.600 కోట్లు కేటాయించింది. ఇప్పతో పాటు చింతపండు, ఉసిరిని కూడా తీపి పదార్థాలుగా, పచ్చడులుగా అమ్మడానికి ట్రైనింగ్ ఇస్తారు.
అమూల్ ఫార్ములా అప్లై చేసి..
వన్ ధన్ వికాస్ కార్యక్రమం కింద మార్కెటింగ్ చేసే హ్యాండిక్రాఫ్ట్స్, బట్టలు, ఆహార పదావర్థాలు, జామ్లు, పచ్చడులు, జ్యువెల్లరీని ఒక్కసారి ప్రాసెస్ చేస్తే సరిపోద్దని ట్రైఫెడ్ ఎండీ ప్రవిర్ చెప్పారు. అమూల్ ఎలాగైతే మార్కెటింగ్ చేసి పాపులరైందో అలాగే తామూ చేస్తామన్నారు. పాలను పాలుగా అమ్మితే అమూల్కు ఏం లాభం రాలేదని.. కానీ ఐస్క్రీమ్గా, తీపి పదార్థాలుగా, పెరుగుగా చేసి అమ్మితే లాభాలొచ్చాయని.. ఇదే పద్ధతి తాము అడవిలో దొరికే పదార్థాలకు అప్లై చేస్తామని వివరించారు. ట్రైఫెడ్ ద్వారా చేసిన చింతపండు, ఇప్ప తీపి పదార్థాలు, పచ్చడులు తీసుకునేందుకు ఎయిర్ ఇండియా ఇప్పటికే ఓకే చేసిందన్నారు. ఆల్కహాల్ పదార్థాలు, డ్రింక్స్ను అమ్మేందుకు కేంద్రం ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు.
చత్తీస్గఢ్లోని బస్తర్లో మస్తుగ..
ఇప్ప చెట్లు చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఎక్కువగా కనబడతాయి. అక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో దీనిదే ముఖ్యపాత్ర. ఇప్ప పూవుల్లో విటమిన్లు, కాల్షియం, ఖనిజలవణాలు ఎక్కువుంటాయి. ఈ పువ్వులను పులియబెట్టి బీర్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తారు. దీన్నే కంట్రీ బీర్ అని కూడా అంటారు. ప్రస్తుతం 90 శాతం వరకు ఇప్ప పూలను బీర్ల తయారీకి వాడుతున్నారు.