వేములవాడ, వెలుగు: ఎన్నికలు రాగానే భావోద్వేగ ప్రసంగాలతో ప్రజలను గందరగోళానికి గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంటారని, అలాంటి వారి నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మహలింగేశ్వర గార్డెన్స్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో వేములవాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీలకు అధికారం ఇచ్చారని, రాష్ట్ర సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు.
పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుల,మతాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అంబేద్కర్ భవన్, బీసీ భవన్, ఎస్టీ భవన్, క్రిస్టియన్ బిల్డింగ్లకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ముస్లిం కోసం అసంపూర్తిగా ఉన్న షాదీఖానాను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలకవర్గం ఉంటే మరిన్ని నిధులు, మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో లీడర్లు రొండిరాజు, చంద్రగిరి శ్రీనివాస్గౌడ్, కనికరపు రాకేశ్, పుల్కం రాజు, బింగి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
