హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్, డెంటల్ చదవాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్, నాన్-మైనారిటీ, మైనారిటీ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సబ్- కేటగిరీ-1 కింద ఉన్న సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ స్థానిక విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా జనరల్ మెరిట్ కింద భర్తీ చేయగా... తాజా ఉత్తర్వులతో ఇకపై 15 శాతం సీట్లను మాత్రమే ఆలిండియా కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించనున్నారు.
ఈ మేరకు తెలంగాణ అన్-ఎయిడెడ్, నాన్ -మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ (పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల నియంత్రణ) రూల్స్– 2017 ను సవరిస్తూ వైద్యారోగ్య శాఖ సోమవారం జీవోలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు అదనంగా 318 పీజీ మెడికల్, 70 డెంటల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా.
