
- మహిళలు మార్పునకు పాత్రధారులు కావాలి
- అఖిల భారత మహిళా అధ్యాపకుల సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- టీచర్లు తమ శక్తిని మార్పుకోసం ఉపయోగించాలన్న సుధామూర్తి
- ఓయూ ఆర్ట్స్కాలేజీ వద్ద 20 అంశాలతో హైదరాబాద్ డిక్లరేషన్
ఓయూ, వెలుగు: మహిళలు మార్పునకు ప్రధాన పాత్రధారులు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సవాళ్లను ఎదుర్కొనే సత్తా మహిళలకు ఉండాలని, అప్పుడే మహిళా సాధికారత సాధించగలరని అన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ లోని ఠాగూర్ ఆడిటోరియంలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) ఆధ్వర్యంలో 'ఎన్విజనింగ్ న్యూ భారత్' థీమ్ తో అఖిల భారత మహిళా అధ్యాపకుల సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి, నేషనల్హ్యూమన్ రైట్స్కమిషన్ చైర్ పర్సన్ విజయ భారతి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ తన ప్రసంగంలో విద్యకు లింగ బేధంలేదని, విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. చిన్న విషయాలకు కుంగిపోకుండా ఆత్మస్థెర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. భారతీయ సంగీతం, సాంస్కృతిక అభివ్యక్తులు లోతైన స్వదేశీ ఆలోచనలను ప్రతిబింబిస్తాయని, కొత్తదనాన్ని వెతకడం కంటే సంప్రదాయ ఆలోచనలను పునర్నిర్మించడం, పునరుద్ధరించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
మహిళలను విమర్శించొద్దు: సుధా మూర్తి
సమాజానికి విలువలను అందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారని రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి అన్నారు. మహిళలను విమర్శించకుండా ప్రశ్నించాలని, వారికి మార్గ నిర్దేశం చేయడం తప్ప నియంత్రించకూడదని సూచించారు. విద్య లింగ భేదరహితమని, ఇతరులతో కాకుండా మనతో మనం పోటీ పడడమే మక్కువగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు తమ శక్తిని మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలన్నారు. విద్యార్థులకు విలువలు నేర్పించడం ముఖ్యమని పేర్కొన్నారు.
ఎన్ హెచ్ఆర్సీది కీలకపాత్ర: విజయ భారతి
మహిళలను రక్షించడం, వారిని శక్తివంతం చేయడంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక పాత్ర పోషిస్తోందని కమిషన్ చైర్పర్సన్విజయ భారతి అన్నారు. సవాళ్లను అధిగమించడంతో పాటు, హక్కులు కోల్పోయిన వ్యక్తులందరికీ న్యాయం అందించడానికి కమిషన్ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. అదనంగా వివిధ శాఖలు, రంగాలలో సహకారం పెంపొందించడానికి కమిషన్ మహిళల కోసం అనేక శిక్షణా కార్యక్రమాలు, సమావేశాలు, వర్క్షాపులు నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. మహిళల విషయంలో పురుషుల దృక్పథంలో మార్పు అవసరమని సూచించారు.
మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడంమానేసి ఇంట్లో, పని ప్రదేశంలో వారికి మరింత స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. జేఎన్యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ పండిట్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో మహిళా నాయకత్వం కీలకమని పేర్కొన్నారు. సదస్సులో ఎక్కువ మంది మహిళలు ఉండడం మార్పునకు సంకేతమని చెప్పారు. అనంతరం ఏబీఆర్ఎస్ఎం నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళా విద్యావేత్తలు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారని కొనియాడారు.
సదస్సుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 1,200 మందికి పైగా మహిళా అధ్యాపకులు హాజరయ్యారని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర, వారి హక్కులు, వారికెదురైన సవాళ్లపై ఈ సదస్సులో చర్చించినట్టు చెప్పారు. దాదాపు 200కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారని ఆయన చెప్పారు.
ఓయూ ఆర్ట్స్కాలేజీ వద్ద హైదరాబాద్ డిక్లరేషన్
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంగ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద హైదరాబాద్ డిక్లరేషన్ నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన విద్యావేత్తలు హైదరాబాద్ డెకరేషన్ లో పాల్గొన్నారు. 20 అంశాల పైన 20 మంది మహిళా విద్యావేత్తలు మహిళల సమస్యల పైన, మహిళలు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారని విషయాలపైన చర్చించారు.
సదస్సులో "జననం నీవే.. జననివి నీవే" అనే మహిళా గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గీతాన్ని ప్రొఫెసర్ వంగీపురం శ్రీనాథాచారి రచించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఆవిష్కరించారు. సినీ గాయకులు రవివర్మ పోతేదార్, బల్లేపల్లి మోహన్ సంగీత దృశ్య సంకలనంతో ఈ గీతాన్ని ప్రదర్శించారు.
సెషన్స్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయి
భారత్ పునర్నిర్మాణం కోసం జరుపుకొన్న ఈ సెషన్స్ చాలా ఇన్సిపిరేషన్గా ఉన్నాయి. ఎంతో గౌరంగా భావించే మహిళలపై జరుగుతున్న సంఘటనలపై జరిగిన ప్రసంగాలు మహిళలను జాగృతం చేసేవిధంగా ఉన్నాయి. ఈ సదస్సు ద్వారా ఎంతోమంది మహిళలను కలుసుకుని, వారి భావాలను షేర్ చేసుకునే అవకాశం దక్కింది. -ప్రొఫెసర్ బాషెట్టి లత
మహిళల అభివృద్ధితోనే..
మహిళలు అభివృద్ధి చెందినపుడే దేశం పురోభివృద్ధితో పయనిస్తుంది. మహిళా విద్యావేత్తలు తమ అమూల్యమైన సందేశాన్ని దేశానికి అందించాలన్న సంకల్పంతోనే ఈ సదస్సును నిర్వహించాం. పాల్గొన్న వారు తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. హైదరాబాద్ డిక్లేషన్లో ప్రకటించిన 20 అంశాలను నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తాం.-శైలజ, సదస్సు కన్వీనర్