
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో 2006లో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం 19 ఏండ్లలో అద్భుత విజయాలు సాధించి స్టేట్లో అగ్రస్థానంలో ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు, అధికారులు, పరిశోధనల వల్లే ఈ రికార్డు సాధ్యమైందన్నారు. బుధవారం టీయూ 2వ కాన్వొకేషన్లో ఆయన మాట్లాడారు. ఆరు కోర్సులతో మొదలైన వర్సిటీ ఇప్పుడు 31 కోర్సులతో కొనసాగుతుండడం గొప్ప విషయమని కితాబునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలను గుర్తించి స్ఫూర్తిదాయకంగా వర్సిటీ నిర్వహిస్తున్నారన్నారు. మున్ముందు మరింత క్వాలిటీ పెంచుకొని స్టూడెంట్స్లో నైపుణ్యాన్ని పెంచాలని, జాబ్స్ సాధించేలా తీర్చిదిద్దాలన్నారు.
క్షయ నిర్మూలనలో గోల్డ్ మెడల్
సామాజిక సేవా కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ అవార్డులు పొందిన రెడ్ క్రాస్ ద్వారా జిల్లాలోని తలసేమియా బాధితులకు బ్లడ్ సమకూరుస్తున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రెడ్ క్రాస్ కోఆర్డినేషన్తో వృద్ధాశ్రమాలు నడుపుతున్నామన్నారు. టీబీ నిర్మూలనకు యంత్రాంగం కృషికి 2022–-23లో గోల్డ్ మెడల్ అందుకున్నామన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో జిల్లా విషయాలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కలెక్టర్వివరించారు. క్షయ నిర్మూలనలో భాగంగా హైరిస్క్ గ్రూప్లో ఉన్న వారి కోసం రెగ్యులర్ స్ర్కీనింగ్, ఎక్స్రే చేయిస్తున్నామని, తెమడ పరీక్షల తరువాత ట్రీట్ మెంట్ ప్రారంభిస్తున్నామన్నారు. వలంటరీ ఆర్గనైజేషన్లను ఇన్వాల్వ్ చేసి న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నామన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి తదితరులు పూలబొకేలు అందించి స్వాగతించారు. రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డెవలప్మెంట్, సంక్షేమ స్కీమ్స్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను గవర్నర్ తిలకించారు. చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, చిత్రకారులు, మ్యుజిషియన్ తదితర రంగాలకు చెందిన 40 మంది జిల్లా ప్రముఖులతో మాట్లాడిన గవర్నర్.. వారితో ఫొటోలు దిగారు. గవర్నర్ రాక సందర్భంగా సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు
ఏర్పాటు చేశారు.
నాలుగు జిల్లాలకు వర్సిటీ విస్తరణ
తెలంగాణ వర్సిటీ పరిధిని నిజామాబాద్, కామారెడ్డితో పాటు అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు విస్తరిస్తానని వైస్ చాన్స్లర్ టి.యాదగిరిరావు అన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొత్త అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అన్ని వసతులతో 500 మంది ఉమెన్స్కు హాస్టల్, అన్ని హంగులతో వెయ్యి మందికి సరిపడా క్రీడా మైదానం తదితర పనులు చేయబోతున్నామని వివరించారు.