
జిల్లాల్లో స్టూడెంట్లు, టీచర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు
ఇంటర్ పరీక్షల్లో 35 వేల పేపర్లలో సున్నా మార్కులు
సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 21 వేల పేపర్లలో సున్నా
హైదరాబాద్, వెలుగు:
పదో తరగతి దాకా చదువులో బాగా రాణిస్తున్నారు. మంచి మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసవుతున్నారు. అదేంటో ఇంటర్కు వచ్చే సరికి మాత్రం డీలా పడిపోతున్నారు. ఇటీవలి ఇంటర్ పరీక్షల మార్కులే అందుకు ఉదాహరణ. పాసవడం మాట దేవుడెరుగు.. సున్నా మార్కులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ సంఖ్య పదులు, వందలు కాదు, వేలాది మంది విద్యార్థులది అదే పరిస్థితి. కొందరికైతే అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నా మార్కులొస్తున్నాయి. దీంతో ఇంటర్బోర్డు అధికారల్లోనూ ఆందోళన మొదలైంది. గవర్నర్ నరసింహన్ కూడా ఈ మధ్య ఈ సున్నా మార్కుల వ్యవహారంపై విస్మయం వ్యక్తం చేయడంతో ఇంటర్ విద్యా ప్రమాణాలు, సంస్కరణలపైన అందరి దృష్టి పడింది. అసలు దానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. ఊళ్లు, జిల్లాలు తిరుగుతూ వారి మునుపటి చదువు తీరుతెన్నులపై ఆరా తీస్తున్నారు.
35 వేల పేపర్లలో సున్నా
ఏప్రిల్18న ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. 9.74 లక్షల మంది పరీక్షలు రాస్తే, 3.28 లక్షల మంది ఫెయిలయ్యారు. అందులోనూ 9 వేల మంది విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకుగానూ 35 వేల పేపర్లలో సున్నా మార్కులొచ్చాయి. పదులు, వందలైతే ఫర్వాలేదు, కానీ, ఒకేసారి వేలు అనేసరికి అందరూ షాక్ తిన్నారు. ముఖ్యమైన సబ్జెక్టులైన మ్యాథ్స్లో 7,800 మందికి, ఫిజిక్స్లో 5,623 మందికి, కెమిస్ర్టీలో 4,233, సివిక్స్లో 1,978, ఎకనామిక్స్లో 1,965, కామర్స్లో 1,245 మందికి సున్నా మార్కులొచ్చాయి. మిగిలిన సబ్జెక్టుల్లోనూ అదే పరిస్థితి. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ చాలా పేపర్లలో సున్నాలు చుట్టేశారు. సెకండియర్లో వివిధ సబ్జెక్టుల్లోని 10 వేల పేపర్లు, ఫస్టియర్లో 11 వేల పేపర్లలో విద్యార్థులకు సున్నా మార్కులు పడ్డాయి. ఈ సున్నాల వ్యవహారంపై ఇటీవల విద్యాశాఖ అధికారులతో గవర్నర్ నిర్వహించన సమీక్షలో చర్చ జరిగింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్, కారణాలతో సహా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం.
మ్యాథ్స్, సైన్స్ గ్రూపుల్లోనే ఎక్కువ
సున్నా మార్కులు ఎక్కువగా మ్యాథ్స్, సైన్స్ గ్రూపుల్లోనే వస్తున్నాయి. దానికి కారణం విద్యార్థులు కాలేజీకి సరిగ్గా రాకపోవడం, వారిని యాజమాన్యాలు పట్టించుకోకపోవడమేనని అధికారులు అంటున్నారు. అయితే, అదొక్కటే కారణం కాదని కొందరు అంటున్నారు. కాలేజీకి సరిగ్గా రాని స్టూడెంట్లు కూడా ఫస్ట్ క్లాసులో పాసవుతున్న సంఘటనలను గుర్తు చేస్తున్నారు. కానీ, ఇంటర్లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది ముగ్గురు స్టూడెంట్లకు ఐఐటీల్లో సీటొచ్చినా, ఇంటర్లో పరీక్ష తప్పారు. ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్నోళ్లూ ఫెయిల్ అయ్యారు. కారణం, విద్యా ప్రమాణాలు పెంచడంలో ప్రభుత్వం, అధికారులు ఫెయిలయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
అధికారులతో కమిటీ
సున్నా మార్కులపై నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ ఆదేశించడంతో ఎస్సీఈఆర్టీ, ఇంటర్బోర్డు అధికారులతో ఓ కమిటీని వేశారు. కమిటీ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. ఇంటర్లో సున్నా మార్కులు వచ్చిన వారి పదో తరగతి మార్కులను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు 8, 9 తరగతుల్లో వాళ్ల చదువు తీరును చూస్తున్నారు. అందుబాటులో ఉండే విద్యార్థులతోనూ మాట్లాడుతున్నారు. టీచర్ల నుంచి వాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను తయారుచేసి, ప్రభుత్వానికి, గవర్నర్కు అందించనున్నారు.
సంస్కరణలు అవసరం
ఇంటర్లో సున్నా మార్కలు రావడం, దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనం. పరీక్షల విధానంతో పాటు కరికులమ్, బోధన విధానాలపైనా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంటర్తో పాటు బడి చదువుల్లోనూ ప్రమాణాలు పెంచేందుకు విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చదువులో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పదో తరగతిలోపు రెండు చోట్ల డిటెన్షన్ విధానం పెడితే బాగుంటుంది.
– మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్