రాజ్ భవన్​కు మర్యాద ఇస్తలేరు : గవర్నర్ తమిళి సై

రాజ్ భవన్​కు మర్యాద ఇస్తలేరు : గవర్నర్ తమిళి సై

మహిళా గవర్నర్ అని వివక్ష చూపుతున్నరు : తమిళిసై 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ తీరుపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ నేషనల్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె మాట్లాడారు. “నేను హాజరవుతున్న అధికారిక కార్యక్రమాలకు కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడం లేదు. నేను గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది” అని అన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని, రాజ్ భవన్ ను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్ భవన్ కు, గవర్నర్ హోదాకు మర్యాద ఇవ్వడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే నాపై విమర్శలు చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదు. జిల్లాలకు వెళ్తే కలెక్టర్, ఎస్పీ రావడం లేదు. యూనివర్సిటీ కాన్వొకేషన్ కు వెళ్తే మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు. గురువారం పాలమూరు యూనివర్సిటీ కాన్వొకేషన్ కు వెళ్తే, అక్కడికి మంత్రులు, ఎమ్మెల్యేలు రాలేదు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ అవసరం లేదంటూ తీర్మానం చేశారు. ఇదేం వివక్ష? ఇదేం మర్యాద? దీనికి రాష్ర్ట ప్రభుత్వం జవాబు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే డౌట్ ఉందన్నారు.

రాజ్ భవన్​కు సీఎం ఎందుకు వస్తలేరు?

 “మా అమ్మ చనిపోతే రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ చేసి పరామర్శించారు. కానీ సీఎం మాత్రం పరామర్శించలేదు” అని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని రాష్ర్టానికి వస్తే సీఎం ఎందుకు రిసీవ్ చేసుకోలేదని ప్రశ్నించారు. ‘‘ఆగస్టు 15న రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం వస్తారని సమాచారం ఇచ్చారు. సీఎం కోసం నేను, హైకోర్టు చీఫ్ జస్టిస్ వెయిట్ చేశాం. కానీ సీఎం రాలేదు. రావడం లేదని కూడా సమాచారం ఇవ్వలేదు. అసలు రాజ్ భవన్ కు సీఎం ఎందుకు రావడం లేదు” అని ప్రశ్నించారు.